హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజల్లో అవగాహన వచ్చినప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. హైడ్రాను ఎందుకు ఏర్పాటు చేశారని, హైడ్రా ఏం చేస్తుందనే విషయమై ఇప్పుడు అందరిలో అవగాహన వచ్చిందన్నారు. ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ కల్చర్ అండ్ డిప్లమాటిక్ రిలేషన్స్ ఆధ్వర్యంలో యునైటెడ్ నేషన్స్ డేను పురస్కరించుకుని ‘మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో సంస్కరణల అవసరం’ అనే అంశంపై గ్రీన్ పార్కు హోటల్లో శుక్రవారం సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆయనముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇటీవల హైడ్రా వార్షికోత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనలో నాలుగైదు తరగతుల విద్యార్థులు కూడా చెరువు ఎఫ్టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవెల్), బఫర్ జోన్ల గురించి వివరించిన తీరే హైడ్రా పట్ల ప్రజల్లో అవగాహన వచ్చిందనడానికి నిదర్శనమన్నారు. హైడ్రా ఏర్పడిన 15 నెలల్లో వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామన్నారు. దీని విలువ దాదాపు రూ. 60 వేల కోట్లు ఉంటుందన్నారు.
