హైదరాబాద్ మియాపూర్ లో రూ. 6 వందల కోట్లు విలువజేసే ప్రభుత్వ భూమిని కాపాడింది హైడ్రా. కబ్జా చేసి ఫెన్సింగ్ వేసిన 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చెర నుంచి కాపాడింది హైడ్రా. స్థానికుల ఫిర్యాదుతో సోమవారం ( డిసెంబర్ 8 ) రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఆక్రమణలు తొలగించారు. 5 ఎకరాల మేర ఉన్న మక్తామహాబ్ కుంటను కబ్జా కాకుండా అడ్డుకుంది హైడ్రా. ఈ భూమి విలువ సుమారు రూ. 600 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.
మియాపూర్ బాచుపల్లి ప్రధాన రహదారికి సమాంతరంగా ఉన్న చెరువు కట్టపై 200 మీటర్ల మేర వేసిన 18 షెట్టర్లను తొలగించారు హైడ్రా అధికారులు. దుకాణాల వెనుక వైపు ప్రైవేటు బస్సుల పార్కింగ్ ఉంచిన స్థలాన్నికూడా ఖాళీ చేయించారు అధికారులు. మియాపూర్ సర్వే నంబర్ 39లో మక్తామహబూబ్పేట చెరువు కట్ట కబ్జాతో పాటు.. గతంలో మైనింగ్కు ఇచ్చిన సర్వేనంబరు 44/5 లో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నట్లు స్థానికుల నుంచి ప్రజావాణికి ఫిర్యాదు అందిన క్రమంలో రంగంలోకి దిగిన హైడ్రా ఆక్రమణలను తొలగించింది.
ఒక్కో షెట్టర్ నుంచి నెలకు రూ. 50 వేల చొప్పున రూ. 9 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు స్థానికులు. అలాగే అక్కడ ప్రైవేటు బస్సుల పార్కింగ్కు స్థలాన్ని ఇచ్చి నెలకు రూ. 8 లక్షల వరకూ వసూలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్వే నంబరు 44/5 కు బదులు 44/4 నంబరును సృష్టించి 5 ఎకరాల భూమిని కబ్జా చేసినట్టు విచారణలో తేలిందని తెలిపారు అధికారులు.కారు వాషింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకుని మొత్తం ఈ భూమిని కబ్జా చేసినట్టు వెల్లడైందని.. మైనింగ్కు ఇచ్చిన భూమి గడువు పెంచాలని దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నిరాకరించిందని తెలిపారు అధికారులు.
మైనింగ్కు ఇచ్చిన భూమిలోనే తప్పుడు సర్వే నంబరు(44/4)తో ఈ కబ్జాలకు పాల్పడినట్టు గుర్తించామని తెలిపారు అధికారులు. శేరిలింగంపల్లి తహసీల్దార్ గతంలో 2013లో నోటీసు ఇచ్చి ఈ షెట్టర్లను తొలగించినట్టు కూడా తేలింది. కబ్జాలకు పాల్పడిన కూన సత్యంగౌడ్, బండారి అశోక్ ముదిరాజ్ల వెనుక బడాబాబులున్నట్టు సమాచారం. వారు వెనుక ఉండి వీరితో కబ్జాల పర్వాన్ని నడుపుతున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ భూమి తమదని చెబుతున్న వారి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడమే కాకుండా.. తాము వేరే వాళ్లతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నామని చెబుతున్నారు. వేరే వాళ్లు ఎవరనేది తేలాల్సి ఉంది.
