
- పార్టీలకు అతీతంగా టెర్రరిజంపై పోరు
న్యూయార్క్: తాను కాంగ్రెస్లోనే ఉన్నానని, పార్టీ కోసమే పనిచేస్తున్నానని ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని, దేశం విషయానికి వచ్చే సరికి తాను దేశం వెంట ఉంటానని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని అన్నారు.
పాకిస్తాన్లో కూర్చొని భారతీయులను చంపుతామంటే ఏ భారతీయుడూ సహించబోడని ఆయన హెచ్చరించారు. పాకిస్తాన్పై దౌత్య యుద్ధం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడు కమిటీల్లో ఓ కమిటీకి నాయకత్వం వహిస్తున్న శశిథరూర్, ఆయన టీమ్.. పాక్ దుశ్చర్యలను వివరించేందుకు గాను అమెరికాకు వెళ్లింది. తాము శశిథరూర్ పేరు పంపకపోయినా ఆయనను ఓ కమిటీకి చీఫ్గా ఎంపిక చేయడం, ఆ మధ్య కేరళలో జరిగిన ప్రధాని మోదీ సమావేశంలో శశిథరూర్ పాల్గొనడంపై కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఉంది.
ఈ నేపథ్యంలో న్యూయార్క్లో శశిథరూర్ మీడియాతో మాట్లాడుతూ.. తాను కేంద్ర ప్రభుత్వం కోసం పని చేయడం లేదని, కాంగ్రెస్తోనే ఉన్నానని, పార్టీ కోసమే పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. అమెరికా సహా అనేక దేశాల మాదిరిగానే భారత్ కూడా టెర్రరిజం బాధిత దేశమని.. ఆ బాధ ప్రతి భారతీయుడికి తెలుసని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదని, అమాయకుల ప్రాణాలు తీస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. 26/11 ముంబై దాడులకు, పుల్వామా దాడులకు పాకిస్తానీ ఉగ్రవాద సంస్థలే కారణమన్నారు.
యుద్ధం చేయాలన్నది భారత్ లక్ష్యం కాదని.. అలా అని ఉగ్రవాదాన్ని ఏ మాత్రం సహించబోమని.. ఇదే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి తమ టీమ్ పర్యటిస్తున్నదని శశిథరూర్ స్పష్టం చేశారు. దెబ్బ కొడితే గట్టిగా, తెలివిగా కొట్టాలని తాను భావిస్తుంటానని.. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఆర్టికల్లో రాశానని గుర్తుచేశారు. పాకిస్తాన్ ఉగ్రమూకలపై మన సైన్యం గట్టిగా, తెలివిగా అటాక్ చేసిందని.. ఇందుకు భారతీయుడిగా ఎంతో గర్వపడుతున్నానని ఆయన అన్నారు.