జనగామ బరిలో ఉండేది నేనే! : ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

జనగామ బరిలో ఉండేది నేనే!  : ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

జనగామ, వెలుగు : ‘చిల్లర మల్లర రాజకీయాలు..కుప్పిగంతులు ఇక్కడ సాగయ్​..గతంలోనే సీఎం కేసీఆర్​ఫోన్​ చేసి బాజాప్తా క్లారిటీ ఇచ్చిండు. మళ్లీ జనగామ బరిలో ఉండేది నేనే’  అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం శివారు భ్రమరాంబ ఫంక్షన్​ హాల్​లో బుధవారం జరిగిన బీసీలకు రూ.లక్ష సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన చీఫ్​ గెస్ట్​ గా హాజరయ్యారు. 

అంతకుముందు ఎమ్మెల్యే టికెట్​మార్పు ప్రచారం పై స్పందించారు. గతంలో పోచంపల్లికి టికెట్​అంటూ దుష్ప్రచారం చేస్తే పల్లా రాజేశ్వర్ రెడ్డి సమక్షంలోనే సీఎం కేసీఆర్ పూర్తి​ క్లారిటీ ఇచ్చారన్నారు. టికెట్ల ప్రకటన జాబితాలో తన పేరు ఏనాడో ఖాయమై పోయిందన్నారు. గెలిచే స్థానాల్లో జనగామ టాప్​ టెన్​లో ఉన్నట్లు సర్వేల్లో తేలిందన్నారు. అటువంటి క్రమంలో పల్లా రాజేశ్వర్​ రెడ్డి ఇక్కడి టికెట్​ఆశిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం ముమ్మాటికీ అసత్యమన్నారు. ఈ తప్పుడు ప్రచారం పై పల్లా రాజేశ్వర్​ రెడ్డి స్వయంగా తనకు ఫోన్​ చేసి వాటిని నమ్మవద్దని, జనగామకు తాను రావడం లేదని, దుష్ప్రచారం చేసిన జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్​రెడ్డిని హెచ్చరించినట్లు చెప్పాడన్నారు.  

ALSO READ:ఓరుగల్లులో నాలాల ఆక్రమణలపై.. సర్కారు యూటర్న్!

పల్లా ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా మరో నాలుగేండ్ల వరకు ఉందన్నారు. తన బిడ్డ తుల్జా భవాని ఆరోపణల వెనక మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్​ రెడ్డి ఉన్నాడన్నారు. కొమ్మూరి కొడుకు, తన అల్లుడు దోస్తులు కావడంతో వెనకుండి కుట్రలు చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని అన్ని విషయాలు సీఎం కేసీఆర్​కు తెలుసన్నారు. మున్సిపల్​ చైర్​పర్సన్​ పోకల జమున, జడ్పీటీసీలు నిమ్మతి దీపిక, ముద్దసాని పద్మజారెడ్డి పాల్గొన్నారు.