నేనూ అందరిలెక్కనే ఫ్రస్టేట్‌‌ అవుతా : ధోనీ

నేనూ అందరిలెక్కనే ఫ్రస్టేట్‌‌ అవుతా : ధోనీ

టీమ్‌‌ ఓడిపోతే ఫ్రస్టేట్‌‌ అవుతా
చాలాసార్లు కోపం వస్తుంది
నాకూ అన్ని రకాల ఎమోషన్స్‌‌
కాకపోతే వాటిని బాగా కంట్రోల్‌‌ చేస్తా
మహేంద్ర సింగ్‌‌ ధోనీ కామెంట్స్

న్యూఢిల్లీ: మ్యాచ్‌‌లో జట్టు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా టీమిండియా మాజీ కెప్టెన్‌‌ మహేంద్ర సింగ్‌‌ ధోనీలో ఎలాంటి ఎమోషన్స్‌‌ ఉండవు. కోపం, ఒత్తిడి వంటివి అతనిలో కనిపించవు. ఎమోషన్స్‌‌ను కంట్రోల్‌‌ చేసుకోవడంలో అతని తర్వాతే ఎవరైనా. అందుకే జట్టు నాయకత్వాన్ని ఎప్పుడో వదలిపెట్టినా.. ఇప్పటికీ మహీని ‘కెప్టెన్‌‌ కూల్‌‌’ అని పిలుస్తుంటారు. అయితే ఎవరు ఎలా అనుకున్నా తాను మాత్రం అందరిలాంటి వాడినేనని ధోనీ అన్నాడు. తనకూ అన్ని రకాల ఎమోషన్స్‌‌ ఉంటాయని, అయితే కొంతమంది కంటే కాస్త బాగా వాటిని కంట్రోల్‌‌ చేస్తుంటానని చెప్పాడు. బుధవారం జరిగిన ఓ ప్రైవేట్‌‌ ప్రొగ్రామ్‌‌లో పాల్గొన్న ధోనీ.. వరల్డ్‌‌ కప్‌‌ తర్వాత తొలిసారిగా మీడియాతో పలు ఆసక్తికర అంశాలు మాట్లాడాడు. ‘నేనూ అందరిలాంటి వాడినే. అన్ని రకాల ఫీలింగ్స్‌‌ ఉంటాయి. అయితే కొంతమంది కంటే ఎమోషన్స్‌‌ను బాగా కంట్రోల్‌‌ చేసుకుంటా. జట్టు ఓడిపోతే  నేను  ఫ్రస్ట్రేట్‌‌ అవుతా. చాలాసార్లు కోపం వస్తుంది. నిరాశకు లోనవుతా. ఇవన్నీ పరిస్థితుల వల్ల వాటంతట అవే కలిగే ఫీలింగ్స్‌‌. అలాంటి పరిస్థితుల్లో నెక్ట్స్‌‌ ప్లాన్‌‌ ఏంటి అని ఆలోచిస్తా. నెక్ట్స్‌‌ వచ్చేది ఎవరు,  నేను ఎవరిని యూజ్‌‌ చేయాలి. నా ఆలోచనంతా ఇలానే ఉంటుంది’ అని ధోనీ చెప్పాడు.

రిజల్ట్‌‌ కంటే ప్రాసెస్‌‌కే ప్రాధాన్యత

కెప్టెన్‌‌గా ఉన్నప్పుడు ఫైనల్‌‌ రిజల్ట్‌‌ కంటే అందుకోసం అనుసరించిన విధానానికే  ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడినని మహీ తెలిపాడు. ‘ టెస్ట్‌‌ మ్యాచ్‌‌లైతే తర్వాతి ప్లాన్‌‌కు వెళ్లడానికి చాలా టైమ్‌‌ ఉంటుంది. కానీ టీ20ల్లో అన్ని ఫాస్ట్‌‌గా జరుగుతాయి. అక్కడ డెసిషన్‌‌ మేకింగ్‌‌లో ఫాస్ట్‌‌గా ఉండాలి. ఫార్మాట్‌‌ ఏదైనా కావొచ్చు..  ఒకరు చేసిన తప్పు వల్ల కానీ జట్టంతా గేమ్‌‌ ప్లాన్‌‌ అమలు చేయలేకపోయినా తేడా జరగొచ్చు’ అని ధోనీ అన్నాడు. పెద్ద టోర్నీలు గెలిచే అంశంపై మహీ మాట్లాడుతూ.. ‘జట్టుగా ఓ టోర్నీ గెలవడమనేది లాంగ్‌‌ టర్మ్‌‌ గోల్‌‌. అయితే దాన్ని చేరుకోవాలంటే ముందు చిన్నచిన్న  లక్ష్యాలను పెట్టుకోవాలి. 2007 టీ20 వరల్డ్‌‌కప్‌‌ అప్పుడు బౌల్‌‌-–ఔట్‌‌కోసం మేము వాడిన స్ట్రాటజీ అందుకు ఉదాహరణ. మేము ప్రతీ ప్రాక్టీస్‌‌ సెషన్‌‌లో బౌల్‌‌–ఔట్‌‌ కు టైమ్‌‌ కేటాయించాం. ఒకవేళ బౌల్‌‌-–ఔట్‌‌కు వెళ్తే.. ప్రాక్టీస్‌‌లో వికెట్లు పడగొట్టడంలో ఎక్కువ రేటింగ్‌‌ ఉన్నవాళ్లకి చాన్సిస్తామని అందరికీ ముందే చెప్పాం. ఎందుకంటే బౌలర్లే ఆ పని చేయగలరని మేము అనుకోలేదు’ అని తెలిపాడు.

టీమ్‌‌ ఎఫర్టే గొప్ప

వ్యక్తిగత పెర్ఫామెన్స్‌‌ కంటే టీమ్‌‌ ఎఫర్ట్‌‌ ఎప్పుడూ గొప్పదని ధోనీ అన్నాడు. ‘మ్యాచ్‌‌ గెలిచినా, ఓడినా జట్టులో ప్రతిఒక్కరికీ అందులో భాగం ఉంటుంది. జట్టులో ప్రతి మెంబర్‌‌కు ఒక రోల్‌‌ ఉంటుంది. టోర్నీ అసాంతం అందరూ తమ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించడం వల్లే 2007 టీ20 వరల్డ్‌‌కప్‌‌ గెలిచాం. జట్టులో కొందరు బాగా ఆడితే సరిపోదు. అందరి భాగస్వామ్యం ఉండాలనుకోవాలి. సరైన టైమ్‌‌లో ఒక వికెట్‌‌, ఒక కళ్లుచెదిరే క్యాచ్‌‌ అన్నింటిని మార్చేస్తాయి’ అని మాజీ కెప్టెన్‌‌ చెప్పాడు.

ధోనీ సంగతేంటో సెలెక్టర్లను అడుగుతా : గంగూలీ

ధోనీ భవిష్యత్తుపై  సెలెక్టర్లతో మాట్లాడతానని బీసీసీఐ ప్రెసిడెంట్​గా త్వరలో బాధ్యతలు తీసుకోనున్న సౌరవ్ గంగూలీ తెలిపాడు. వరల్డ్‌‌కప్‌‌ ముగిసినప్పటి నుంచి ధోనీ రిటైర్మెంట్‌‌పై వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే మహీ ఈ అంశంపై ఎక్కడా ఇప్పటిదాకా నోరువిప్పలేదు. ఈ నేపథ్యంలో ధోనీ రిటైర్మెంట్‌‌ విషయంపై దాదా స్పందించాడు. ‘ఈనెల 24న సెలెక్షన్‌‌ కమిటీతో జరిగే మీటింగ్‌‌లో సెలెక్టర్లతోపాటు కెప్టెన్‌‌తో మాట్లాడతా. ధోనీ గురించి ప్రశ్నిస్తా. వారి ప్లాన్స్‌‌ కూడా తెలుసుకుని నా అభిప్రాయం చెబుతా. ధోనీతో కూడా మాట్లాడి అతని ఆలోచనేంటో, ఏం చేయాలనుకుంటున్నాడో కూడా తెలుసుకుంటా’ అని చెప్పాడు.