- ‘ఐబొమ్మ’ రవి అరెస్ట్
- ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్
- నెదర్లాండ్స్ నుంచి హైదరాబాద్కు వచ్చిన నిందితుడు
- కూకట్పల్లిలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైం పోలీసులు
- నాంపల్లి కోర్టులో హాజరు.. 14 రోజులు రిమాండ్
- చంచల్ గూడ జైల్కు తరలించిన పోలీసులు
తెలుగు సినిమాలను పైరసీ చేస్తూ సినీ ఇండస్ట్రీకి, పోలీసులకు సవాలుగా మారిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. శనివారం ఉదయం నెదర్లాండ్స్ నుంచి హైదరాబాద్కు వచ్చిన రవిని కూకట్పల్లిలో అదుపులోకి తీసుకున్నారు.
బషీర్బాగ్, వెలుగు: తెలుగు సినిమాలను పైరసీ చేస్తూ సినీ ఇండస్ట్రీకి , పోలీసులకు సవాలుగా మారిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. శనివారం ఉదయం నెదర్లాండ్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన రవిని కూకట్ పల్లి లోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు సినిమాలు పైరసీకి గురవుతున్నాయని, దీంతో ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం వాటిల్లుతోందంటూ ఈ ఏడాది ఆగస్టు 30న తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ యాంటీ వీడియో పైరసీ సెల్ హెడ్ రామ్ వరప్రసాద్.. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. రవి కదలికలపై నిఘా పెట్టారు. సినీ పరిశ్రమ పెద్దలు కూడా గతంలో హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్ ను కలిసి ఐబొమ్మ పై ఫిర్యాదు చేశారు.
ఐబొమ్మ నుంచి బప్పంగా మార్పు
ఐబొమ్మ వెబ్ సైట్లను సైబర్ క్రైం పోలీసులు బ్లాక్ చేయడంతో రవి తన వెబ్ సైట్ ను బప్పం టీవీగా పేరు మార్చారు. కొత్తగా థియేటర్ లో రిలీజ్ అయిన చిత్రాలతో పాటు , ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో విడుదలైన సినిమాలను కూడా హెచ్ డీ ప్రింట్లతో రవి అప్ లోడ్ చేశారు. ఒకానొక దశలో పోలీసులకు, సినీ పరిశ్రమ పెద్దలకు ఆయన కొరకరాని కొయ్యగా మారారు.
తనను పట్టుకోండంటూ పోలీసులకు సవాలు కూడా విసిరారు. విదేశాల్లో ఉంటూ పైరసీ తతంగాన్ని నడిపారు. అందుకు స్థానికంగా ఉన్న కొద్దిమంది వ్యక్తుల సహకారం కూడా తీసుకున్నారు. ఇటీవల ఈ పైరసీకి సహకరిస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.
సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ నుంచి పైరసీ వరకు
ఇమ్మడి రవి గతంలో ఈఆర్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా పనిచేశారు. ఐదేళ్ల క్రితం తన భార్య నుంచి విడాకులు తీసుకొని పైరసీ రంగంలోకి అడుగుపెట్టారు. సామాన్యులు థియేటర్ కు వెళ్లి సినిమా చూడలేని స్థితిలో టికెట్ రేట్లు ఉన్నాయని, అందుకోసమే తాను ఐ బొమ్మ వెబ్ సైట్ ను ప్రారంభించానని రవి గతంలో ఓ ప్రకటన చేశారు.
కాగా.. రవి వద్ద నుంచి పైరసీకి సంబంధించిన మెటీరియల్ ను సైబర్ క్రైం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ2.5 కోట్ల నగదును కూడా సీజ్ చేశారు. ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రవికి జడ్జి 14 రోజుకు రిమాండ్ విధించడంతో నిందితుడిని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.
కాగా.. సైబర్ క్రైం పోలీసులు 7 రోజుల పాటు రవి కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశారు. ఆయన హైదరాబాద్ కు ఎందుకు వచ్చారు, ఆయన వెనుక ఇంకెవరు ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
