
దుబాయ్: ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న మహిళల వన్డే వరల్డ్ కప్ తేదీలు, వేదికలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఖరారు చేసింది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నీ 2025, సెప్టెంబర్ 30 నుంచి 2025 నవంబర్ 2 వరకు భారత్, శ్రీలంకలోని ఐదు వేదికలలో హైబ్రిడ్ మోడ్లో జరగనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. భారత్లోని బెంగళూరు, గౌహతి, ఇండోర్, విశాఖపట్నం స్టేడియాల్లో మ్యాచులు జరగనున్నాయి.
పాకిస్తాన్ తమ మ్యాచ్లను శ్రీలంక కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆడనుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ అతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా పాక్ వెళ్లేందుకు భారత జట్టు నిరాకరించింది. దీంతో టోర్నీని హైబ్రిడ్ మోడ్లో నిర్వహించి.. భారత్ ఆడే మ్యాచులను దుబాయ్ వేదికగా నిర్వహించారు. ఇప్పుడు పాక్ కూడా భారత్కు వచ్చేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఆ జట్టు ఆడే మ్యాచులను శ్రీలంకకు తరలించింది ఐసీసీ.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. పాకిస్తాన్ అర్హతను బట్టి అక్టోబర్ 29న గౌహతి లేదా కొలంబోలో మొదటి సెమీ-ఫైనల్ జరుగుతుంది. రెండవ సెమీస్ అక్టోబర్ 30న బెంగళూరులో జరుగుతుంది. నవంబర్ 2న ఫైనల్ జరగనుండగా.. బెంగుళూరు ఆతిథ్యం ఇవ్వనుంది. ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్కు వస్తే ఆ మ్యాచ్ కొలంబోలో జరుగనుంది. పాక్ ఫైనల్కు అర్హత సాధించకపోతే యధావిధిగా బెంగుళూర్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ .. ఈ జట్లు వరల్డ్ కప్ కోసం పోటీ పడనున్నాయి.
ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది. సొంత దేశంలో టోర్నీ కావడంతో భారత్ హాట్ ఫేవరెట్. భారత్ చివరగా 2013లో ప్రపంచ్ కప్కు ఆతిథ్యం ఇవ్వగా.. ఈ టోర్నీలో ఇండియా ఉమెన్స్ టీమ్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. 2017లో లార్డ్స్లో జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడంతో వన్డే వరల్డ్ కప్ భారత మహిళలకు కలగానే మిగిలింది. ఈ సారి టోర్నీ భారత్లోనే జరుగుతుండటంతో హర్మన్ప్రీత్ కౌర్ సేన టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. టోర్నీ పూర్తి షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేస్తామని ఐసీసీ వెల్లడించింది.