- ఒక్క రోజులో తేల్చుకోవాలని బంగ్లాకు ఐసీసీ వార్నింగ్
- మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలన్న రిక్వెస్ట్ రిజెక్ట్
దుబాయ్: ఇండియాలో మ్యాచ్లు ఆడేందుకు ఒప్పుకోకపోతే టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ను బహిష్కరించాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) డిసైడైంది. బుధవారం జరిగిన ఐసీసీ బోర్డు అత్యవసర సమావేశంలో మెజారిటీ సభ్యులు బంగ్లా వైఖరికి వ్యతిరేకంగా ఓటు వేశారు. భద్రతా కారణాల దృష్ట్యా తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని బంగ్లా చేసిన అభ్యర్థనను ఐసీసీ పూర్తిగా తిరస్కరించింది. వాటిని షెడ్యూల్ ప్రకారం ఇండియాలోనే ఆడాలని తేల్చి చెప్పింది.
స్వతంత్ర భద్రతా సమీక్షల ప్రకారం ఇండియాలో ఆ టీమ్ ఆటగాళ్లకు ఎలాంటి ముప్పు లేదని ఐసీసీ స్పష్టం చేసింది. టోర్నీలో పాల్గొనే విషయంలో బుధవారం లోపు తేల్చుకోవాలన్న ఐసీసీ ఆ జట్టుకు తాజాగా మరో24 గంటల డెడ్లైన్ ఇచ్చింది. ‘స్వతంత్ర సమీక్షలతో సహా నిర్వహించిన అన్ని భద్రతా అంచనాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ అంచనాలు ఇండియాలోని అన్ని వేదికల్లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు, మీడియా ప్రతినిధులు, అధికారులు, అభిమానులకు ఎలాంటి ముప్పు లేదని సూచించాయి’ అని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది.
సమయం తక్కువగా ఉండటంతో టోర్నీ షెడ్యూల్ను గానీ.. వేదికలను గానీ మార్చడం కుదరదని తేల్చి చెప్పింది. గురువారం లోపు బంగ్లా ప్రభుత్వం లేదా బోర్డు ఇండియాకు వచ్చేందుకు అంగీకరించకపోతే ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించి దాని ప్లేస్లో స్కాట్లాండ్ను బరిలోకి దింపాలని ఐసీసీ బోర్డు నిర్ణయించింది. బంగ్లా, పాకిస్తాన్ మినహా మిగిలిన అన్ని దేశాల బోర్డులు ఐసీసీ నిర్ణయానికే మద్దతు పలికాయి. టీ20 వరల్డ్ కప్లో బంగ్లా ఆడే మ్యాచ్లకు తాము ఆతిథ్యం ఇస్తామని పాక్ బోర్డు ఆఫర్ చేసింది కానీ, దీన్ని ఐసీసీ బోర్డు పట్టించుకోలేదు.
ఒకవేళ బంగ్లా పట్టు వీడకపోతే ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో ఆ జట్టు లేకుండానే మ్యాచ్లు జరగనున్నాయి. టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా బంగ్లాదేశ్ స్థానంలో వరల్డ్ కప్లో ఆడేందుకు స్కాట్లాండ్ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. గురువారం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
