దేశంలో కొన్నిచోట్ల జరుగుతున్న బలవంతపు మత మార్పిడులపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. వాటిని నివారించకపోతే అత్యంత తీవ్రమైన పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించింది. దీనిపై చర్యలు తీసుకునేందుకు వెంటనే రంగంలోకి దిగాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆందోళన వ్యక్తం చేసింది. బలవంతపు మతమార్పిడులను ఆపి తీరాల్సిందేనని స్పష్టం చేసింది.
వాటిని ఆపేందుకు కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు నిర్దేశించింది. బలవంతపు మత మార్పిళ్ల నియంత్రణకు చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయాలంటూ ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ కామెంట్స్ చేసింది.