కరోనా కట్టడిలో కేసీఆర్​ ఫెయిలైతే.. మరి పాసైందెవరు?

కరోనా కట్టడిలో కేసీఆర్​ ఫెయిలైతే..  మరి పాసైందెవరు?

మహబూబ్నగర్, వెలుగు‘‘కరోనా విషయంలో కేసీఆర్ ఫెయిల్ అయిండని అంటున్నరు.. మరి పాస్ అయిన వారెవరో చెప్పాలి? ఇండియా ఇపుడు ప్రపంచంలో మూడోస్థానంలో ఉంది..  మరి ప్రధాని ఫెయిల్ అయ్యారని అందామా..?’’ అని రాష్ట్ర మున్సిపల్​మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కరోనా విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసరంగా నోరు పారేసుకుంటున్నాయని విమర్శించారు. చేయడానికి ఏమీ లేక విమర్శిస్తున్న వారి  తిట్లనే ఆశీర్వాదంగా తీసుకుని ముందుకు పోతామని ఆయన చెప్పారు. ఇకపై కరోనా తో కలిసి జీవించాలని అందరూ తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోవాలని సూచించారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో రూ. 480 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్  కాలేజీ కొత్త బిల్డింగ్​ను సోమవారం మంత్రులు ఈటల రాజేందర్​, శ్రీనివాస్​గౌడ్​తో కలిసి కేటీఆర్​ ప్రారంభించారు. అనంతరం మెడికల్​ కాలేజీ ఆడిటోరియంలో ఆయన​మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటివరకు 34 వేల మందికి కరోనా వస్తే 94 శాతం మంది డిశ్చార్జ్ అయ్యారని,  98 శాతం రికవరీ ఉంటోందని, కేవలం 2 శాతం మరణాలు వస్తున్నాయని చెప్పారు. ‘‘శవాలు తీసుకెళ్లేందుకు కూడా బంధువులు రావడంలేదు. ఇంత పెద్ద విపత్తులో చిన్న చిన్న లోపాలు ఉంటాయి. కానీ డాక్టర్ల  ఆత్మస్థైర్యం  దెబ్బ తీసేలా వార్తలు రాయొద్దు’’ అని కేటీఆర్​ అన్నారు. చాలా ప్రైవేటు హాస్పిటళ్లు పేషెంట్లను వెళ్లగొడితే ప్రభుత్వ హాస్పిటళ్లలో ట్రీట్​మెంట్  అందిస్తున్నామని చెప్పారు. కరోనాకు ఎవరూ అతీతులు కాదని అన్నారు.

ఐసీఎంఆర్​ సూచనల మేరకే టెస్టులు

కరోనా టెస్టులు ఎక్కువగా చేయడంలేదన్నది నిజం కాదని మంత్రి కేటీఆర్​ అన్నారు.  ఐసీఎంఆర్ సూచనల ప్రకారం టెస్టులు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ పెద్దల మనో ధైర్యాన్ని దెబ్బతీసేలా కాకుండా  కరోనాపై పోరాటంలో కలిసిరావాలని ఆయన సూచించారు. రాపిడ్ యాంటీ జెన్ కిట్లతో టెస్టులు చేయడం  శుభపరిణామమన్నారు. రష్యాలో వ్యాక్సిన్ కనుగొన్నారనే వార్తలు వస్తున్నాయని.. మందు, వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్​ సూచించారు. కరోనా వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ కూడా ముందున్నదని చెప్పారు. ఇండియాలో వాక్సిన్​ తయారీకి 6 కంపెనీలు కృషి చేస్తుంటే ఇందులో నాలుగు మన రాష్ట్రానికి చెందినవేనన్నారు. రాష్ట్రంలో ప్లాస్మా థెరపీ మొదలు పెట్టామని, ముమ్మాటికీ ఆరోగ్య తెలంగాణగా మారుతుందన్నారు.

తక్కువ టైంలో ఎక్కు ఫలితాలు: ఈటల

వైద్య రంగంలో అతి తక్కువ టైంలో ఎక్కువ ఫలితాలు సాధించిన రాష్ట్రంగా  తెలంగాణ గుర్తింపు దక్కించుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్  అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత  5 మెడికల్ కాలేజీలు స్థాపించుకున్నామని చెప్పారు. మహబూబ్​నగర్​లో  అతి తక్కువ కాలంలో కాలేజీ నిర్మాణం పూర్తయి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కావడం గొప్ప విషయమన్నారు. కాలేజీకి అనుబంధంగా వెయ్యి బెడ్ల హాస్పిటల్​ కోసం భూమి పూజ చేశామని వివరించారు. పాలమూరు లోనూ కొవిడ్ స్పెషల్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ప్రగతి భవన్​ ఓ దేవాలయం: శ్రీనివాస్​గౌడ్

ప్రగతి భవన్​ ఓ దేవాలయం అని, తెలంగాణ ఆవిర్బావం తర్వాత సీఎం కేసీఆర్​ ఆధ్వర్యంలో ఎన్నో పథకాలకు అక్కడ అంకురార్పణ జరిగిందని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ చెప్పారు. కేసీఆర్  వందేండ్లు బతకాలని, తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని మంత్రి
ఆకాంక్షించారు.

కరోనా ఇమ్యూనిటీ 3 నెలలే…