
తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తే దేశంలో అంధకారం తప్పదని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్పీఈజేఏసీ) హెచ్చరించింది. ఎస్మాలు, అరెస్టుల పేరుతో విద్యుత్ ఉద్యోగుల ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. సోమవారం విద్యుత్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీఎస్పీఈ జేఏసీ ఆధ్వర్యంలో మింట్ కాంపౌండ్లోని టీఎస్ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం వద్ద పుదుచ్చేరి విద్యుత్ ఉద్యోగులకు సంఘీభావంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. జేఏసీ సెక్రటరీ జనరల్ సదానందం మాట్లాడుతూ.. పుదుచ్చేరి డిస్కంను 100 శాతం ప్రైవేటీకరణకు సెప్టెంబరు 27న టెండర్లను పిలిచారని తెలిపారు.
దీనికి విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు సెప్టెంబరు 28నుంచి నిరవధిక సమ్మెకు దిగారని తెలిపారు. ఉద్యోగులపై ఎస్మా ప్రయోగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు. పుదుచ్చేరి విద్యుత్ ఉద్యోగులకు మనోధైర్యాన్ని నింపేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పుదుచ్చేరికి తరలివెళ్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు వేణు, వజీర్, వెంకటనారాయణరెడ్డి, శ్రీనివాస్, జనప్రియ, కిరణ్, శ్రీనివాస్రెడ్డి, గోపాల్రావు, బాగయ్య, సురేశ్, రాధిక రెడ్డి, జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు.