టీఆర్ఎస్ కు ఓటెయ్యకపోతే పెన్షన్ కట్ చేస్తం

టీఆర్ఎస్ కు ఓటెయ్యకపోతే పెన్షన్ కట్ చేస్తం
  • దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి బెదిరింపులు 

హుజూరాబాద్ నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: టీఆర్ఎస్ కు ఓటు వేయనోళ్లకు పెన్షన్ కట్ చేస్తమని ఓటర్లను రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కె.వాసుదేవరెడ్డి బెదిరించారు. ఆదివారం ఇల్లందకుంట మండలం అంతడుపులలో దివ్యాంగులు, వృద్ధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘సల్లకొచ్చి ముంత దాసుడేమీ లేదు. నేను పక్కా చెప్తున్నా ఓటేయనోళ్ల అందరి పెన్షన్లు వంద శాతం కట్ అయితయ్. ప్రతి ఊరిలో సర్పంచ్ టీఆర్ఎస్ నుంచే ఉన్నడు. నేనైతే అడుగుతున్నా ఎవరైతే పెన్షన్లు ఉన్నోళ్లు ఓట్లు ఏత్తలేరో.. వాళ్ల పేర్లు ఇయ్యండి.. వేయనోళ్ల అందరిని బ్లాక్ లిస్టులో పెట్టేద్దాం’’ అని వాసుదేవరెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారు. టీఆర్ఎస్ కు ఓటేయకపోతే పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు ఆపేస్తామని గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ నాయకులు ఓటర్లను బెదిరిస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. వారి ఆరోపణలకు బలం చేకూర్చేలా వాసుదేవరెడ్డి బెదిరింపుల వీడియో బయటికి రావడం కలకలం సృష్టిస్తోంది.