
- మత్తు కోసం కల్లులో మిక్సింగ్
- మూడు ఉమ్మడి జిల్లాల్లోని కల్లు దుకాణాలకు తరలింపు
- బానిసలుగా మారుతున్న పేదలు
- పట్టించుకోని ఆబ్కారీ శాఖ
- నిర్మల్ సమీపంలో మినీ ప్రొడక్ట్ యూనిట్ పట్టివేత
నిర్మల్, వెలుగు: రాష్ట్రంలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో కల్లు మాఫియా హద్దులు దాటి దందాను విస్తరిస్తోంది. కొంతమంది కల్లు వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి విచ్చలవిడిగా దుకాణాలను ఏర్పాటు చేస్తూ.. వినియోగదారులకు ఫుల్లుగా మత్తెక్కించేందుకు అందులో క్లోరల్ హైడ్రేట్, ఆల్ఫాజోలం కలుపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ మత్తుకు అలవాటు పడిన నియోగదారులు ఆ కల్లుకు బానిసలుగా మారిపోతున్నారు.
మహారాష్ట్ర నుంచి ఈ క్లోరల్ హైడ్రేట్, ఆల్ఫాజోలంను పెద్ద మొత్తంలో నిర్మల్ మీదుగా పలు జిల్లాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే నిర్మల్ జిల్లాలో పలుమార్లు ఈ మత్తు పదార్థాలను పట్టుకున్న అధికారులు.. తాజాగా నిర్మల్ పట్టణ సమీపంలో ఓ వ్యవసాయ క్షేత్రంలో క్లోరల్ హైడ్రేట్ ను తయారు చేసే ఓ మినీ యూనిట్ ను స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దుల్లో క్లోరల్ హైడ్రేట్, ఆల్ఫాజోలం అక్రమ తరలింపు పై సరైన నిఘా లేని కారణంగా ఈ కల్లు వ్యాపారులు దర్జాగా రవాణా
సాగిస్తున్నారంటున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు తరలింపు
మహారాష్ట్రలోని థానే జిల్లా లింబావలి గ్రామ పరిసరాల్లో చాలా చోట్ల క్లోరల్ హైడ్రేట్, అల్ఫాజోలం రసాయనాల తయారీ పరిశ్రమలున్నాయి. ఈ ప్రాంతంలో ఇవి మినీ పరిశ్రమలుగా కొనసాగుతున్నాయి. తయారీదారులతో కొంత మంది కల్లు వ్యాపారులు మిలాకత్ అయి గుట్టుచప్పుడు కాకుండా భారీ ఎత్తున ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు తరలిస్తున్నారు. స్థానికంగా మరికొంతమంది కల్లు వ్యాపారులు వీటిని కొనుగోలు చేసి గ్రామాల్లోని కల్లు వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని కల్లు డిపోల్లో కూడా ఈ రసాయనాలను ఎక్కువ మొత్తంలో కలుపుతున్నారు.
బానిసలుగా మారుతున్న యూత్
క్లోరల్ హైడ్రేట్, ఆల్ఫాజోలం వంటి మత్తు కలిగించే పదార్థాలను కల్లులో కలుపుతుండడంతో ఈ మత్తుకు అలవాటు పడిన నియోగదారులు ఆ కల్లుకు బానిసలుగా మారిపోతున్నారు. ముఖ్యంగా యువకులు బానిసలవుతున్నారు. వీరితోపాటు కూ లీలు, చాలామంది డ్రైవర్లు సైతం కల్లుకు బానిసలుగా మారి మత్తులో జోగుతున్నారు. కొద్దిరోజులు వరుసగా ఈ కల్లు తాగి పిచ్చి చేష్టలు చేస్తూ మానసిక రోగులుగా మారిపోతున్నారు. క్లోరోహైడ్రేట్, ఆల్ఫాజోలం కలిపిన కల్లుకు బానిసలైన వారు ఒక్కసారిగా మానేస్తే తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. మతిస్తిమితం కోల్పోయి పిచ్చిచేష్టలు చేస్తున్నారు. ఈ కల్లు తాగేవారు ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, జీర్ణకోశ వ్యాధులకు గురవుతున్నారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు.
రాజకీయ అండదండలతో...
విచ్చలవిడిగా కల్లు వ్యాపారం చేసే కొంత మందికి రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. దీంతో కల్లు డిపోలు, దుకాణాలపై తనిఖీలు చేసేందుకు అధికారులు వెనుకడుతున్నట్లు తెలుస్తోంది. కల్లు వ్యాపారులకే కాకుండా కల్లులో కలిపే క్లోరల్ హైడ్రేట్, ఆల్ఫాజోలం అక్రమ సరఫరాదారులకు సైతం రాజకీయ నాయకులు సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మినీ యూనిట్ పట్టివేత
కాగా మహారాష్ట్రలోని లింబావలి, సోలాపూర్, భీవండి లాంటి ప్రాంతాల నుంచి క్లోరల్ హైడ్రేట్, ఆల్ఫాజోలంతో పాటు క్లోరో అనే ద్రావణాన్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా నిర్మల్ పట్టణ సమీపం చిట్యాల సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో క్లోరో ద్రావణంతో క్లోరల్ హైడ్రేట్ ను తయారు చేస్తున్నారు. లిక్విడ్ క్లోరోను గడ్డకట్టించేందుకు డ్రమ్ముల్లో పోసి గుంతలు తవ్వి, దాని చుట్టూ ఐస్ గడ్డలను ఉంచి పది రోజుల పాటు నిల్వ చేసి క్లోరల్ హైడ్రేట్ గా మారుస్తున్నారు.
ఈ మినీ యూనిట్ సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం రాత్రి దాడి చేసి పెద్ద ఎత్తున క్లోరోడ్ హైడ్రేట్, అల్ఫాజోలం సంచులను స్వాధీనం చేసుకున్నారు. సూత్రధారులు బుర్ర రమేశ్ గౌడ్, రామాగౌడ్ తోపాటు వీరికి సహకరిస్తున్న శ్రీనివాస్ గౌడ్, రాజశేఖర్ గౌడ్, రాజు గౌడ్ అనే వ్యక్తులు పట్టుకొని వారిపై కేసులు నమోదు చేశారు.