ఆసీస్ను ఇప్పుడు ఓడించడం కష్టం
న్యూఢిల్లీ: ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ తన ఫ్యూచర్ గురించి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీమ్ సెలెక్టర్లకు కచ్చితమైన సమాచారం ఇచ్చే ఉంటాడని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ‘ధోనీతో నేనింకా మాట్లాడలేదు. అతని ఆలోచన నాకు తెలియదు. ఆడాలా..? వద్దా..? అనేది అతని ఇష్టం. అయితే నిస్సందేహంగా ధోనీ అత్యుత్తమ ఆటగాడు. ఇండియాకు వన్డే వరల్డ్కప్, టీ20 వరల్డ్కప్ అందించిన చాంపియన్. ధోనీ లాంటి ప్లేయర్లు దొరకడం కష్టం.’ అని గంగూలీ అన్నాడు.
కంగారూలను వారి సొంత గడ్డపై ఇప్పుడు ఓడించడం అంత తేలిక కాదని బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టెస్ట్ సిరీస్లో విరాట్సేన తమ అత్యుత్తమ ఆటతో చెలరేగాలని ఆకాంక్షించాడు. 71 సంవత్సరాల నిరీక్షణ అనంతరం.. 2018లో కంగారూల సొంత గడ్డపై ఇండియా తొలిసారి టెస్ట్ సిరీస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆసీస్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ బాల్ ట్యాంపరింగ్ బ్యాన్ కారణంగా జట్టుకు దూరంగా ఉన్నారు. అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ‘2018లో ఆస్ట్రేలియాపై మనం గెలిచినప్పుడు వారిది అత్యుత్తమ జట్టు కాదు. ఈ సారి కంగారూలు ఈ జనరేషన్లోని అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగుతారు. టీమిండియాకు వారిని ఓడించే సత్తా ఉంది. ఫాస్ట్ బౌలర్స్, స్పిన్నర్స్, చాంపియన్ విరాట్, ఓపెనర్గా రోహిత్ శర్మ, మూడు నాలుగు నెలలుగా అద్భుతంగా రాణిస్తున్న అజింక్యా రహానెతో మన జట్టు బలంగా ఉంది. ఓవర్సీస్ క్రికెట్లో ఓపెనర్లు రాణించడం చాలా ముఖ్యం. ఓపెనర్లు మంచి ఆరంభాన్నిస్తే కంగారూలను ఓడించగలం. గెలుస్తామనే నమ్మకంతో బరిలోకి దిగాలి. నేను కెప్టెన్గా ఉన్నప్పుడు అత్యుత్తమ జట్టుతో తలపడి గెలవాలనేదే నా లక్ష్యం. 2003లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్ట్ల సిరీస్ను ఇండియా 1–1తో డ్రాగా ముగించింది.’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు.