
శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది. అలాంటి ఏకాదశుల్లో పుత్రదా ఏకాదశి ఒకటి. సంతానం లేని వారు పిల్లలు కోసం ఈ ఏకాదశిని జరుపుకుంటారు. శ్రావణమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే పుత్రద ఏకాదశి అని అంటారు. ఈరోజున లక్ష్మీసమేతుడైన శ్రీమహావిష్ణువును పూజిస్తారు. అయితే ఈ ఏడాది ఈ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, పూజా విధానం ఏంటో తెలుసుకుందాం..
హిందూ ధర్మ సంప్రదాయంలో ఒక్కో ఏకాదశికీ ఒక్కో ప్రాముఖ్యత ఉంది. పుత్రద ఏకాదశికి కూడ ఒక ప్రత్యేకత ఉంది. శ్రావణ మాసంలో వచ్చే శుద్ద ఏకాదశికి ( పౌర్ణమికి ముందు) పుత్రద ఏకాదశి అని పేరు ఉంది. భవిష్య పురాణంలో పుత్రద ఏకాదశి విశిష్టత చాలా వివరంగా ఉంది.
2025 పుత్రదా ఏకాదశి ముహూర్తం వివరాలు
- ఏకాదశి తిథి ప్రారంభం :ఆగస్టు 4న ఉదయం 11:41 గంటలకు
- ఏకాదశి తిథి ముగింపు: ఆగస్టు 5న మధ్యాహ్నం 1:12 గంటలకు
- ఉదయం తిథి ప్రకారం,పుత్రద ఏకాదశి పండుగను ఆగస్టు 5, మంగళవారం నాడు ఆచరిస్తారు. ఉపవాసాన్ని ఆగస్టు 6న విరమించాలి.
పూజా వివరాలు
- ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి తలస్నానం చేయాలి.
- దంపతులు పుత్రద ఏకాదశి వ్రతం చేయాలనుకునేవారు దశమి రోజు నుంచి ఉపవాసాన్ని ప్రారంభించాలి.
- ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండాలి.
- పూజా స్థలంపై విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఉంచి 'పంచామృతం' అభిషేకం చేయాలి.
- పూలు, పసుపు, కుంకుమతో అర్చించి .. విష్ణు సహస్రనామం పఠించాలి. లేదా శ్రద్దగా విన్నా సరిపోతుంది.పూజలో కచ్చితంగా తులసి దళాలు ఉండేలా చూసుకోండి.
- విష్ణుమూర్తి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉండాలి.
- విష్ణువును స్తుతిస్తూ భజనలు....భక్తి పాటలు పాడుతూ రాత్రంతా జాగారం చేస్తారు. భక్తులు సాయంత్రం సమయంలో సమీపంలోని విష్ణువు ఆలయాలను కూడా సందర్శించాలి
- పుత్రదా ఏకాదశి రోజు ఓం నమో భగవతే వాసుదేవాయఅనేమంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపం చేయాలి.
శ్రావణ పుత్రదా ఏకాదశి ఆచారాలు
- శ్రావణ పుత్ర ఏకాదశి నాడు ఉపవాసం ప్రధాన ఆచారం. మగబిడ్డ కోసం ఆరాటపడితే భాగస్వాములిద్దరూ తప్పనిసరిగా ఉపవాసం పాటించాలి.
- సంతానం కావాలనుకునే దంపతులు కఠినమైన ఉపవాసాన్ని పాటించాలి.
- ఆరోగ్య కారణాల వలన ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు తీసుకోవచ్చు.
- శ్రావణ పుత్రదా ఏకాదశి నాడు ధాన్యాలు, పప్పులు, బియ్యం, ఉల్లిపాయలు మరియు మాంసాహారం అసలు తినకూడదు.
- దశమి రోజు ( ఆగస్టు 4) సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తినాలి. దశమి రాత్రి సంపూర్ణ బ్రహ్మచర్యం పాటిస్తారు.
- ఉపవాసాన్ని ద్వాదశి ఘడియలు ముగిసేలోగా విరమించాలి. నిష్టగా ఉపవాసాన్ని చేస్తే మోక్షం సైతం సిద్ధిస్తుందని అని నమ్మకం .. సంతానం కలుగుతుంది.
- పూజా క్రతువులు ముగించి, బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇచ్చి.. ఉపవాసం విరమించాలి.
శ్రావణ పుత్రదా ఏకాదశి కథ
మహిజిత్తు అనే మహారాజు పాలించే రాజ్యంలో ఉన్న ప్రజలు అంత సిరిసంపదలతో సంతోషముగా ఉంటారు. కానీ రాజు గారికి సంతానం లేదు, ఈ కారణంగా దేశ ప్రజలు బాధతో ఉండేవారు. మహారాజు సంతానం కోసం తిరగని పుణ్యక్షేత్రం లేదు. దీనికి పరిష్కారం మహారాజుకు తెలుస్తుంది. అదేమిటంటే రాజ్యానికి దగ్గరలో లోమశుడనే మహర్షి దగ్గర ఉందని.... ఆయన్ని దర్శించుకొని వారికున్న సందేహం విన్నవించుకుంటారు.
మహారాజు కి ఏ వ్రతాన్ని ఆచరిస్తే సంతానం కలుగుతుందో వివరించాలని ప్రజలు ఆ లోమశు మహర్షిని వేడుకున్నారు. దాంతో ఈ పుత్రద ఏకాదశి పూజ విధానం మరియు ఎలా ఆచరించాలో ఇలా చెప్పాడు.
శ్రావణ మాసంలో మొదటి ఏకాదశి రోజున నిష్టగా చేస్తే మహారాజుకి సంతానం కలిగితీరుతుందని చెప్పాడు. ఆయన సూచన మేరకు రాజదంపతులతో పాటుగా ఆ రాజ్యంలోని ప్రజలందరు ఈ వ్రతాన్ని ఆచరించారు. లోమశుడు చెప్పినట్లుగానే రాజు గారికి పుత్రసంతానంతో పాటు ఎవరికైతే సంతానం లేదో ఈ వ్రతం ఆచరించిన వాళ్ళందరికి సంతానం ప్రాప్తించింది. అందుకే అప్పటి నుంచి ఈ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని పిలుస్తున్నారు.
పుత్రద ఏకాదశి ప్రాముఖ్యత
పుత్రద ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల పిల్లలు లేని దంపతులకు సంతానం కలుగుతుందని నమ్ముతారు. కొత్తగా పెళ్లైన జంటలు ఈ ఏకాదశి చేయడం ఉత్తమంగా భావిస్తారు. పుత్రద ఏకాదశి రోజునే అరుదైన ఇంద్రయోగం, భద్ర యోగం ఏర్పడుతున్నాయి. ఈ యోగ సమయాల్లో పూజలు చేయడం వల్ల ఆ దేవుడి ఆశీస్సులు మీకు మెండుగా ఉంటాయి. మీ కోరికలు ఫలిస్తాయి. ఇదండి పుత్రదా ఏకాదశి ( 2025 ఆగస్టు 5) ప్రాముఖ్యత...