- అడియాలా జైలు అధికారుల వెల్లడి
- డిసెంబర్ 2న ఇమ్రాన్ను కలిసేందుకు
- కుటుంబ సభ్యులకు అనుమతి
- అడియాలా జైలు అధికారుల వెల్లడి
- డిసెంబర్ 2న ఇమ్రాన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారని జైలు అధికారులు ప్రకటించారు. ఆయన రావల్పిండిలోని అడియాల జైల్లోనే ఉన్నారని, వేరే ఏ జైలుకూ షిఫ్ట్ చేయలేదని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశారు. ఆయనకు అవసరమైన వైద్య పరీక్షలు చేయిస్తున్నట్లు తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేశారు. ఇమ్రాన్ బయట కంటే జైల్లో సౌకర్యవంతంగా ఉన్నారన్నారు. ఫైవ్స్టార్ హోటళ్లలో కూడా లభించని మంచి ఆహారాన్ని అతడు పొందుతున్నారన్నారు. ఆయనకు జైలులో విలాసవంతమైన సౌకర్యాలను అందిస్తున్నట్లు వెల్లడించారు.
ఇమ్రాన్ను కలవనున్న పార్టీ నేతలు
అవినీతి ఆరోపణల కేసులో 2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉన్నారు. తాజాగా జైలులో ఇమ్రాన్ హత్యకు గురయ్యారనే ప్రచారం నేపథ్యంలో ఆయన అక్కాచెల్లెళ్లు జైలు ముందు ఆందోళనకు దిగారు. తమ సోదరుడిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చే మంగళవారం ఇమ్రాన్ను కలిసేందుకు అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. అదేవిధంగా, పార్టీ వ్యవహారాలను చర్చించేందుకు పీటీఐ నేతలకూ ఇమ్రాన్ను కలిసేందుకు అధికారులు అనుమతిచ్చారు.
