ములుగు జిల్లాలో యువకుడి ఆత్మహత్యాయత్నం

ములుగు జిల్లాలో యువకుడి ఆత్మహత్యాయత్నం

చిన్న చిన్న విషయాలకు ఈ మధ్య కొందరు యువతీ, యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలతో వారి నిండు ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ములుగు జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. 

ములుగు జిల్లా : ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో -రాకేష్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. 

చిన్నబోయినపల్లికి మూడు రోజుల నుండి కరెంట్ రావడం లేదని గ్రామస్తులతో కలిసి సబ్ స్టేషన్ ముందు రాకేష్ నిరసన తెలిపాడు. సబ్ స్టేషన్ పై దౌర్జన్యం చేశారని విద్యుత్ శాఖ సిబ్బంది పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో తనపై పోలీసు కేసు ఉంటే ప్రభుత్వ ఉద్యోగంతో పాటు పాస్ పోర్ట్ కూడా రాదనే ఆందోళనతో రాకేష్ పురుగుల మందు తాగాడు. మనస్తాపంతో సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మందు తాగడంతో పరిస్థితి విషమించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.