ఆరోగ్యశ్రీ ఉన్నా.. జేబుల నుంచి కట్టుడే

ఆరోగ్యశ్రీ ఉన్నా.. జేబుల నుంచి కట్టుడే
  • ఆపరేషన్లకు సర్కారు ఇచ్చేది అంతంతే
  • మిగతా సొమ్ము పేషెంట్లనే కట్టాలంటున్న హాస్పిటళ్లు
  • నిమ్స్​లోనూ ఇదే పరిస్థితి..  
  • తిప్పలు పడుతున్న పేదలు 
  • ఆరోగ్యశ్రీ రేట్లను ప్రభుత్వం సవరించకపోవడమే అసలు కారణం

జగిత్యాల, వెలుగు : ఆరోగ్యశ్రీ పథకం కింద  వెయ్యికి పైగా చికిత్సలను ఫ్రీగా చేయిస్తున్నామని రాష్ట్ర సర్కారు చెప్తున్నప్పటికీ.. చాలా చోట్ల అమలైతలేదు. వివిధ చికిత్సలకు సర్కారు చెల్లిస్తున్న రేట్లను15 ఏండ్లుగా సవరించకపోవడంతో నిమ్స్​సహా పలు కార్పొరేట్​, ప్రైవేట్ ఆసుపత్రులు ఫ్రీ ట్రీట్​మెంట్​కు ఒప్పుకోవట్లేదు. ప్రభుత్వం ఇచ్చే రేట్లకు, బయట రేట్లకు చాలా తేడా ఉంటున్నదని, అందువల్ల సర్కారు ఇచ్చేది పోగా మిగిలిన డబ్బులు చెల్లిస్తామని ఒప్పుకుంటేనే ట్రీట్​మెంట్​ చేస్తామని తేల్చిచెప్తున్నాయి. చావు బతుకుల పరిస్థితి కావడంతో జనం అప్పుసప్పు చేసి డబ్బులు కట్టి ఆర్థికంగా చితికిపోతున్నారు. 

సర్కారు చెప్పేది ఒకటి.. జరుగుతున్నది మరొకటి
కార్పొరేట్​ వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఉమ్మడి ఏపీలో 2007 ఏప్రిల్​ 1న అప్పటి సీఎం వైఎస్ ​రాజశేఖరరెడ్డి ‘రాజీవ్​ ఆరోగ్య శ్రీ’ స్కీం  తీసుకువచ్చారు. ఆ పథకం ప్రస్తుతం కూడా కొనసాగుతున్నది. తెల్లరేషన్​కార్డు ఉన్న కుటుంబానికి 1,026 రకాల చికిత్సలను ఈ స్కీమ్​ కింద ఫ్రీగా అందించాల్సి ఉంది. కేంద్రం తెచ్చిన ఆయుష్మాన్​భారత్​లో చేరిన తర్వాత ఆరోగ్య శ్రీ కింద మరో 646 చికిత్సలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 

అంతకుముందు ఏడాదికి ఒక్కో కుటుంబానికి గరిష్ఠ ప్రయోజనం రూ. 2 లక్షలు ఉండగా, దానిని రూ. 5 లక్షలకు పెంచింది. మొత్తం మీద ఆరోగ్య శ్రీ కింద రాష్ట్రంలోని 246 కార్పొరేట్​, ప్రైవేట్​హాస్పిటళ్లతో పాటు 166 ప్రభుత్వ హాస్పిటళ్లలోనూ ఫ్రీ ట్రీట్​మెంట్​ అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. కానీ, చాలా హాస్పిటళ్లు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్​మెంట్​ చేసేందుకు ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు గిట్టుబాటు కావడం లేదని తిరస్కరిస్తున్నాయి. 

ఇంకా 15 ఏండ్ల కిందటి రేట్లే.. 
2007లో ఆరోగ్యశ్రీని ప్రారంభించినప్పుడు వివిధ చికిత్సలకు అప్పటి కాంగ్రెస్​ సర్కారు ఏ రేట్లు నిర్ణయించిందో ఇప్పటికీ అవే రేట్లు కొనసాగుతున్నాయి. ఉదాహరణకు  ఓపెన్ అపెండెక్స్​ సర్జరీకి చిన్నాచితక ప్రైవేట్​ ఆసుపత్రుల్లోనూ రూ. 25 వేల నుంచి-30 వేలు వసూలు చేస్తుండగా.. ప్రభుత్వం మాత్రం రూ. 17,500  ఇస్తున్నది. ఓపెన్ సైనస్ సర్జరీకి రూ. 25 వేల- నుంచి 30 వేలు ఉండగా.. సర్కారు ఇచ్చేది రూ. 15 వేలు మాత్రమే. ఓపెన్ హార్ట్​ సర్జరీకి రూ. 2 లక్షల నుంచి 3 లక్షల దాకా ఉంటే ప్రభుత్వం కేవలం రూ.80 వేలే చెల్లిస్తున్నది. ఇలా ఏ సర్జరీ తీసుకున్నా రాష్ట్ర సర్కారు ఇచ్చే రేట్లతో పోలిస్తే బయట కార్పొరేట్​, ప్రైవేట్​ ఆసుపత్రులు వసూలు చేసే రేట్లు రెండు నుంచి నాలుగు రెట్లు అదనంగా ఉంటున్నాయి. ఆ  బిల్లులు కూడా ప్రభుత్వం నుంచి వచ్చేసరికి ఏండ్లకు ఏండ్లు పడుతున్నది. దీంతో చాలా కార్పొరేట్​, ప్రైవేట్​హాస్పిటళ్లు ఆరోగ్యశ్రీ కింద పేషెంట్లను చేర్చుకోవడానికి ఇష్టపడటం లేదు.

తప్పనిసరి పరిస్థితుల్లో చేర్చుకుంటున్న కొన్ని హాస్పిటళ్లు.. సర్కారు నుంచి వచ్చే పైసలు పోగా మిగిలిన అమౌంట్ ను పేషెంట్ల నుంచి వసూలు చేస్తున్నాయి. నిజానికి సర్కారు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద అన్ని రకాల సర్జరీలను చేసే వీలున్నప్పటికీ కావాల్సిన స్పెషలిస్టులు, ఫెసిలిటీస్​ లేకపోవడంతో హెర్నియా, ఎపిగ్యాస్ట్రిక్​, పైల్స్​, సైనస్​, హిస్టరక్టమీ లాంటి చిన్నచిన్న సర్జరీలకే పరిమితమవుతూ మిగిలినవాటికి నిమ్స్​లాంటి హాస్పిటల్స్​కు రెఫర్​ చేస్తున్నారు. ఇలా వచ్చే రోగుల నుంచి  ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తున్న నిమ్స్​లోనూ బ్యాలెన్స్​ అమౌంట్​ వసూలు చేస్తుండడంతో పేదలు అప్పులపాలవుతున్నారు. అప్పు పుట్టనివారు ప్రాణాలు కోల్పోతున్నారు. గడిచిన 15 ఏండ్లలో రెంట్లు, మెడికల్​ ఎక్విప్​మెంట్​, స్పెషలిస్టులు, ఇతర స్టాఫ్​జీతాలు భారీగా పెరిగినా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ రేట్లను పెంచడం లేదని, రేట్లు  పెంచితే తప్ప తాము ఏమీ చేయలేమని ప్రైవేట్, కార్పొరేట్​ఆసుపత్రుల మేనేజ్​మెంట్లు చెప్తున్నాయి. కానీ, రేట్లు సవరించేందుకు రాష్ట్ర సర్కారు ముందుకురావడం లేదు. 

ఈమె పేరు వెంకటమ్మ. సొంతూరు.. మహబూబ్​నగర్ జిల్లా మిడ్జిల్.  ఓ యాక్సిడెంట్​లో తీవ్రంగా గాయపడింది. ట్రీట్​మెంట్ ​కోసం మహబూబ్​నగర్​ జీజీహెచ్ఎస్​కు తరలించిన్రు. కాలు డ్యామేజీ అయ్యిందని డాక్టర్లు హైదరాబాద్​ పొమ్మన్నరు. దీంతో కుటుంబ సభ్యులు వెంకటమ్మను హైదరాబాద్​లోని నిమ్స్​లో జాయిన్​ చేసిన్రు. ఆరోగ్య శ్రీ కార్డు ఉండటంతో ట్రీట్మెంట్ మొత్తం ఫ్రీగా అవుతుందనుకున్నరు. కానీ,  ఆపరేషన్ పూర్తి అయ్యాక ఆరోగ్య శ్రీ కింద రూ. 30 వేలే ప్రభుత్వం ఇస్తదని, మిగతా రూ. 80 వేల బిల్లు కట్టాల్నని చెప్పడంతో అప్పు చేసి మరీ కట్టిన తర్వాతే డిశ్చార్జ్​ చేసిన్రు. 

రూ. 1.25 లక్షల బిల్లయితే.. వచ్చింది రూ. 48,250
ఈమె పేరు సత్య. సొంతూరు.. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు. తల్లి దేవక్క, నాలుగేండ్ల బిడ్డతో కలిసి జగిత్యాలలోని ఓ కిరాయి ఇంట్లో ఉంటున్నది. తల్లితో కలిసి పలు ఇండ్లలో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నది. ఇటీవల సత్య అనారోగ్యంతో మంచం పట్టింది. ఆమె బ్రెయిన్​లో రక్తం గడ్డ కట్టిందని,  హైదరాబాద్ తీస్కపొమ్మని లోకల్​ డాక్టర్లు చెప్పిన్రు. దీంతో గత నెల 28న నిమ్స్​లో చేరగా.. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసిన డాక్టర్లు రూ.1.25 లక్షల బిల్లు వేసిన్రు. ఆరోగ్య శ్రీ కింద రూ. 48,250 వస్తుందని, మిగతా మొత్తం చెల్లించాలని అక్కడి స్టాఫ్​ చెప్పడంతో దేవక్క తాను పనిచేసే చోట కాళ్లావేళ్లా పడి పైసలు తెచ్చి కట్టింది.

రూ. 30 వేలు కడితేనే ఆపరేషన్​ చేసిన్రు
నా భర్తకు పెద్ద పేగు​క్యాన్సర్​ రావడంతో హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కు తీసుకపోయినం.  ఆరోగ్యశ్రీ కింద ట్రీట్​మెంట్​చేయలేమని అక్కడివాళ్లు బీబీ హాస్పిటల్ కు పంపిన్రు.  బీబీ హాస్పిటల్​లో  ఆరోగ్య శ్రీ కింద సర్జరీ చేస్తమని చెప్పి జాయిన్​ చేసుకున్నరు. ఆరోగ్యశ్రీ అప్రూవల్ వచ్చిందంటే సంతోషపడ్డం.. కానీ ఆపరేషన్​కు కొన్ని డబ్బులు మాత్రమే గవర్నమెంట్ ఇస్తదని, మిగిలిన  రూ. 30 వేలు మీరే కట్టుకోవాల్నని హాస్పిటల్​ వాళ్లు అన్నరు. దీంతో తెలిసినవాళ్ల దగ్గర అప్పు చేసి రూ. 30 వేలు కట్టిన. ఆ తర్వాతనే  ఆపరేషన్ చేసిన్రు. ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా ఆపరేషన్​ చేస్తరనుకుంటే ఇట్ల మాలాంటి పేదల నుంచి పైసలు వసూలు చేసుడు అన్యాయం. 


- జే భాగ్యమ్మ, గోపాల్ పేట, వనపర్తి జిల్లా