- దళారులకా.. మిల్లర్లకా..?
- జనగామ జిల్లాలో వరి వేసిన రైతులు 1.31 లక్షల మంది
- సివిల్సప్లయ్కు అమ్మినోళ్లు 36,690 మంది
జనగామ, వెలుగు: జనగామ జిల్లాలో వరి సాగు చేసిన రైతులు, వడ్లు అమ్మిన రైతుల సంఖ్యకు భారీ తేడా ఉంది. సెంటర్లకు రాని రైతులందరూ తమ ధాన్యాన్ని దళారులకు అమ్మారా..? మిల్లర్లకు అమ్మారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. యాసంగి, వానాకాలం సీజన్లలో వ్యవసాయ శాఖ క్రాప్ సర్వే నిర్వహిస్తుంది. ఈ సర్వేలో ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఏ పంట సాగు చేస్తున్నారో నమోదు చేస్తారు. ఈ లెక్క ప్రకారమే జిల్లాలో ఎంతమంది రైతులు సాగు చేసిన పంటల్లో దిగుబడిని అంచనా వేయడంతో పాటు కొనుగోలు చేయడానికి ప్లాన్ రూపొందించుకుంటారు. కాగా జనగామ జిల్లాలో వరి సాగుచేసిన రైతులు, కొనుగోలు సెంటర్లో అమ్ముకున్న రైతుల సంఖ్యలో తేడా ఉంది.
జనగామ జిల్లాలో 1.31 లక్షల మంది రైతులు
జనగామ జిల్లాలో 12 మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో యాసంగి 2025–26 సీజన్లో వ్యవసాయ శాఖ క్రాప్ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం జిల్లాలోని 1.31 లక్షల మంది రైతులు 2.20 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో సన్న రకం కేవలం 30 వేల ఎకరాల్లోనే వేశారు. దీనికి సంబంధించి 4.45 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని భావించారు. యాసంగి సీజన్లో వడ్ల కొనుగోళ్లు ముగిశాయి. సెంటర్లకు వచ్చే 3 లక్షల టన్నులు కొనాలని సివిల్సప్లయ్ డిపార్ట్మెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా 36,690 మంది రైతుల నుంచి 2.49 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్టు ప్రభుత్వ రికార్డుల్లో పేర్కొంది.
మధ్య దళారులు, మిల్లర్లకే
కాగా సెంటర్లకు వడ్లు తీసుకురాని రైతులు.. తమ ధాన్యాన్ని దళారులకు లేదా మిల్లర్లకు అమ్మినట్లు తెలుస్తోంది. కొనుగోలు సెంటర్లలో కొనుగోళ్లలో జాప్యంతోపాటు రైతుల తమ ఆర్థిక అవసరాల కోసం దళారులకు అమ్ముకున్నారని భావిస్తున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు జిల్లాలోని కొందరు మిల్లర్లే పెద్ద సంఖ్యలో వడ్లు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ వడ్లను పెండింగ్లో ఉన్న సీఎంఆర్ రైస్ ప్రభుత్వానికి అప్పగించేందుకు తక్కువ రేటుకు వడ్లు కొన్నారన్న అనుమానం కలుగుతోంది. ఇలా జనగామ జిల్లాలో 93,491 మంది రైతులకు చెందిన సుమారు 2లక్షలకు పైగాఎకరాల్లో పండిన పంట బయట అమ్ముకున్నట్లు తెలుస్తోంది.
