ముత్తారం, వెలుగు: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు ఫ్యూజు వేయడానికి వెళ్లిన రైతు విద్యుత్షాక్కు గురై మృతిచెందాడు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలకేంద్రానికి చెందిన మారం వెంకట్రెడ్డి(43) పారుపల్లి గ్రామ శివారులో వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజు పోవడంతో విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా స్వయంగా ఫ్యూజు వేయడానికి వెళ్లాడు.
ఏబీ స్విచ్ను ఆఫ్ చేసినా అది పూర్తిగా పనిచేయకపోవడంతో ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా కొనసాగుతూనే ఉంది. ఈ విషయం గమనించకుండా వెంకట్రెడ్డి విద్యుత్ స్తంభంపైకి ఎక్కగా, పక్కనే ఉన్న 11 కేవీ బుష్ రాడ్ తగిలి విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలాన్ని పరిశీలించిన విద్యుత్ శాఖ ఏడీఈ వంగల వెంకట్ నారాయణ మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యలు తలెత్తితే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని, సొంత రిపేర్లు చేయవద్దని సూచించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
