- వివాహేతర సంబంధం వల్లే మర్డర్
- ఫాస్ట్ఫుడ్ నిర్వాహకుడి హత్య కేసు ఛేదించిన పోలీసులు
- నలుగురు అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం
రేగొండ, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందిన ఫాస్ట్ఫుడ్ నిర్వాహకుడు శ్రావణ్(35) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ సంపత్రావు మంగళవారం వివరాలను వెల్లడించారు.
రంగయ్యపల్లికి చెందిన శ్రావణ్ కొన్నేళ్లుగా రేగొండ మండలకేంద్రంలోని ఓ వైన్స్ షాప్ ఎదురుగా ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మల్లెబోయిన శ్రీకాంత్ తన భార్య మౌనికతో కలిసి మిర్చి, బజ్జీల దుకాణం నిర్వహించేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడగా, అవసరానికి శ్రీకాంత్.. శ్రావణ్ వద్ద రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు.
అనంతరం శ్రావణ్కు శ్రీకాంత్ భార్య మౌనికతో పరిచయం పెరిగి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని శ్రావణ్ ఒత్తిడి చేయడంతో పాటు వ్యక్తిగత విభేదాలు పెరగడంతో శ్రీకాంత్ కక్ష పెంచుకున్నాడన్నారు.
ఈ నెల 3న రాత్రి శ్రీకాంత్ తన సోదరుడు బుల్లి, కూరకుల సందీప్, ఓ మైనర్ బాలుడి సాయంతో శ్రావణ్ను అతని షాపు ఎదుట కత్తులు, తల్వార్తో దారుణంగా నరికి హత్య చేశారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి తల్వార్, కత్తి, స్కూటీ, బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తులో సీఐ కరుణాకర్రావు, ఎస్ఐలు సుధాకర్, హేమ, త్రిలోక్నాథ్రెడ్డి పాల్గొన్నారు.
