వరంగల్, వెలుగు: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ కబ్జాల సొమ్ముతో మద్రాస్, తిరుపతిలో కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకున్నాడని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఆరోపించారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ లీడర్ల అసత్య ప్రచారంతో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ప్రభుత్వ భూములు కొనుగోలు చేసిన వారు డబ్బులు కట్టడం లేదన్నారు. కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డితో కలిసి నగరానికి వచ్చే ఇన్వెస్టర్లను భయపెడుతూ, వరంగల్ సిటీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు.
కుడా భూముల వేలంలో వందల కోట్ల అవినీతి జరిగిందని, ప్రభుత్వ భూములను ఫైవ్ స్టార్ హోటల్కు ఇస్తున్నారని విమర్శించడమే తప్ప ఆధారాలు చూపే తెలివి లేదన్నారు. కుడా భూముల వేలం కుడా ఆఫీసులో కాకపోతే మీ ఇంట్లో పెడతారా? అంటూ నిలదీశారు.
తప్పుడు ప్రచారాలతో నగరానికి రావాల్సిన ఫైవ్, సెవన్ స్టార్ హోటల్స్, సాఫ్ట్వేర్ కంపెనీలు వెనక్కు పోతున్నాయన్నారు. వినయ్ భాస్కర్, ఆయన తమ్ముడు విజయ్ భాస్కర్ 59 జీవోను అడ్డం పెట్టుకుని హంటర్రోడ్లో 2 వేల గజాల భూమి కబ్జా చేశారని ఆరోపించారు. తాను కబ్జాలు చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేశారు.
