కోడేరు,(పెద్దకొత్తపల్లి), వెలుగు: ‘సర్’ డిజిటలైజేషన్ ను వేగంగా పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం బాచారం గ్రామపంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) డిజిటలైజేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా, నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్థానిక ప్రాథమిక పాఠశాల శిథిలావస్థపై స్పందిస్తూ భవన ఫిట్నెస్ పరిశీలించి రిపేర్లు లేదా నూతన భవన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం మండలం కేంద్రంలోని కేజీబీవీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీలో రెగ్యులర్ ప్రత్యేక అధికారి లేకపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై స్పందిస్తూ, త్వరలోనే రెగ్యులర్ స్పెషల్ ఆఫీసర్ను నియమిస్తామని హామీ ఇచ్చారు.
సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలి
కందనూలు : వర్షాకాలంలో ప్రబలే డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు, అతిసార వంటి కాలానుగుణ వ్యాధులను అరికట్టేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో క్షేత్రస్థాయిలో నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు.
అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లాలోని ఈవీఎం గోదామును సందర్శించిన కలెక్టర్, ఈవీఎంల భద్రతను పరిశీలించారు. ఆ తర్వాత రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ బుధవారం జిల్లాలో చేపట్టనున్న విస్తృత పర్యటన, నూతన ఆర్టీఓ కార్యాలయ భవన ప్రారంభోత్సవం, కొత్త ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ శంకుస్థాపన ఏర్పాట్లను ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డితో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
