ఇలా చేశారేంటన్నా.. 76 పరుగులకే ఆలౌట్.. టీమిండియా ఓటమి, శ్రేయాస్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు

ఇలా చేశారేంటన్నా.. 76 పరుగులకే ఆలౌట్.. టీమిండియా ఓటమి, శ్రేయాస్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు

ఇంగ్లండ్, టీమిండియా మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్లో టీమిండియా జట్టు ఘోరంగా ఓడింది. ఇంగ్లండ్ జట్టు నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో దారుణంగా విఫలమై 76 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా ఇంత చెత్తగా ఆడటంపై అభిమానులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. టీమిండియా బ్యాటర్లలో ఒక్కరి స్కోర్ కూడా 15 పరుగులు లేదంటే మన బ్యాటర్లు ఎంత దరిద్రంగా ఆడారో అర్థం చేసుకోవచ్చు.

అభిషేక్ శర్మ 10, వైభవ్ సూర్యవంశీ 13, ఇషాన్ కిషన్ 13, శ్రేయాస్ అయ్యర్ 5, అక్షర్ పటేల్ 10, తిలక్ వర్మ 3, హర్షిత్ రాణా 9, శివమ్ దూబే 2, అర్ష్ దీప్ సింగ్ 4, వరుణ్ చక్రవర్తి 5, ప్రిన్స్ యాదవ్ 2 (నాటౌట్).. ఇదీ 202 పరుగుల టార్గెట్ ఛేజ్లో టీమిండియా బ్యాటింగ్ చేసిన తీరు. ఇంగ్లండ్ పేస్ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటింగ్ కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 4 ఓవర్లకు 28 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లతో రాణించాడు. జోఫ్రా ఆర్చర్ 3 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అడిల్ రషీద్ 2 వికెట్లు, విల్ జాక్స్ ఒక వికెట్ తీసి టీమిండియాను 76 పరుగులకే ఆలౌట్ చేశారు.

శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంజూ శాంసన్ను పక్కన పెట్టేయడంపై కూడా టీమిండియా అభిమానులు రుసరుసలాడుతున్నారు. వైభవ్ సూర్యవంశీ 2 సిక్సులు కొట్టి దూకుడుగా ఆడి వికెట్ సమర్పించుకోవడంపై కూడా టీమిండియా అభిమానులు రగిలిపోతున్నారు. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఫిలిప్ సాల్ట్ 70 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు. జాస్ బట్లర్ 36 పరుగులు, శామ్ కరన్ 41 పరుగులు చేసి ఇంగ్లండ్ జట్టుకు మంచి స్కోర్ అందించారు.

హ్యారీ బ్రూక్ 16, బెతెల్ 13, విల్ జాక్స్ 14, ఆర్చర్ 5 పరుగులు చేశారు. టామ్ బాంటన్ డకౌట్ కావడం గమనార్హం. టీమిండియా బౌలర్లలో హర్షిత్ రాణా 2 వికెట్లు, ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. దీంతో.. నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. టీమిండియా 76 పరుగులకే చేతులెత్తేయడంతో 125 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ జట్టు మూడో టీ20లో ఘన విజయం సాధించింది. రెండో టీ20లో కూడా టీమిండియా ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఐదు టీ20ల సిరీస్లో ఇంగ్లండ్ జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది.