- ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్
- బకాయి రూ. 1,054 కోట్లు
- 12.5 లక్షల మంది స్టూడెంట్ల ఎదురుచూపులు
- ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్న మేనేజ్మెంట్లు
- సర్టిఫికెట్లు అందక పైకోర్సులకు వెళ్లలేకపోతున్న స్టూడెంట్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్ల ఫీజురీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ పైసలిస్తలేదు. భారీగా బకాయిలు పేరుకుపోయాయి. ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీల మేనేజ్మెంట్లు తెల్చి చెప్తున్నాయి. దీంతో ఇటు ఫీజులు చెల్లించలేక, సర్టిఫికెట్లు చేతికి రాక.. అటు పైకోర్సుల్లో చేరలేక స్టూడెంట్లు ఆగమవుతున్నారు. సర్టిఫికెట్లు లేక ఉద్యోగావకాశాలు కూడా కోల్పోతున్నారు. కొందరు అప్పొసప్పో చేసి ఫీజులు కడుతుంటే.. మరికొందరు మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారు. రూ. వెయ్యి కోట్లకు పైగా ఫీజు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఏటా సర్కారు ఇట్లనే వ్యవహరిస్తున్నదని, స్టూడెంట్లు తీవ్రంగా నష్టపోతున్నారని స్టూడెంట్ యూనియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
12.5 లక్షల స్టూడెంట్స్ వెయిటింగ్
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల అప్లికేషన్ల పరిశీలనే నత్తనడకన సాగింది. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, బీటెక్, ఫార్మసీ, బీఈడీ తదితర అన్ని రకాల కోర్సులు కలిపి మొత్తం 12.5 లక్షల మందికి ఫీజులు చెల్లించాల్సి ఉంది.ఇందులో ఫ్రెషర్స్ 5.5 లక్షలు, రెన్యువల్స్ 7 లక్షల మంది ఉన్నారు. వీళ్లు ఫీజుల కోసం చూస్తున్నారు.
రూ. 1,054 కోట్ల బకాయిలు పెండింగ్
రాష్ట్రంలో ఇప్పటివరకు రూ. 1,054 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 2018–19, 2019–20 అకడమిక్ ఇయర్స్లో రూ. 1,036 కోట్ల పెండింగ్లో ఉన్నాయి. 2019 – 20 అకడమిక్ ఇయర్లో రూ. 1,988 కోట్ల వెరిఫైడ్ డిమాండ్ ఉండగా.. రూ. 1,050 కోట్లు మాత్రమే సర్కారు చెల్లించింది. మరో రూ. 938 కోట్లు పెండింగ్లో ఉండగా.. ఇందులో రూ. 745 కోట్లు రీయింబర్స్మెంట్స్, రూ. 193 కోట్లు స్కాలర్షిప్ డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. 2018–19 సంవత్సరానికి సంబంధించి రీయింబర్స్మెంట్ డబ్బులు రూ. 85 కోట్లు, స్కాలర్షిప్ డబ్బులు రూ. 13 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. అంతకు ముందు అకడమిక్ ఇయర్లోనూ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి.
అకడమిక్ ఇయర్ ముగిసి ఆర్నెల్లు గడిచినా..
స్కాలర్షిప్లు, ఫీజు రీయంబర్స్మెంట్ కోసం అకడమిక్ ఇయర్ ప్రారంభంలోనే స్టూడెంట్లు అప్లయ్ చేసుకోవాలి. అప్లికేషన్ల పరిశీలనలో అర్హులని తేలితే వెంటనే 25 శాతం ఫీజు రీయింబర్స్మెంట్స్ అందించాలి. అకడమిక్ ఇయర్ మధ్యలో 50 శాతం, మిగిలినవి చివరిలో చెల్లించాలి. కానీ ఈ నిబంధనలు ఎప్పుడూ సక్కగా అమలు కావడంలేదు. సాధారణంగా అకడమిక్ ఇయర్ మార్చిలో ముగుస్తుంది. అకడమిక్ ఇయర్ ముగిసి ఆర్నెల్లు గడిచినా ఇంకా ఫీజు బకాయిలను ప్రభుత్వం విడుదల చేయడం లేదు.
ఫీజులు చెల్లిస్తనే సర్టిఫికెట్లు ఇస్తరట
కరోనాతో కొన్ని కోర్సుల ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ కాగా.. మరికొన్ని కోర్సుల ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఇటీవల ఇంజనీరింగ్, డిగ్రీ, ఫార్మసీ, పాలిటెక్నిక్ తదితర కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వెరిఫికేషన్ టైంలో టీసీలు, మెమోలు ఉండాలి. అయితే సర్టిఫికెట్లు కాలేజీల్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉండటంతో కాలేజీ మేనేజ్మెంట్లు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. పూర్తి బకాయిలు చెల్లిస్తేనే ఇస్తామని మొండికేస్తున్నాయి. దీంతో స్టూడెంట్స్ పేరెంట్స్ గత్యంతరం లేకపోవడంతో వడ్డీలకు అప్పులు తెచ్చి కట్టాల్సి వస్తున్నది.
నష్టపోతున్న స్టూడెంట్స్
ప్రభుత్వ తీరుతో చాలా మంది స్టూడెంట్స్ ఫీజులు కట్టలేక చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారు. కొంతమంది సర్టిఫికెట్లు లేక జాబ్స్ కోల్పోతున్నారు. కొన్ని కాలేజీల్లో ముందు సంవత్సరం ఫీజులు చెల్లించకపోవడంతో తర్వాత సంవత్సరానికి సంబంధించి ఎగ్జామ్ ఫీజులు, సప్లమెంటరీ ఫీజులు తీసుకోవడం లేదు. బీటెక్, బీఫార్మసీ రిజల్ట్స్ వారం కిందనే వచ్చాయి. మరికొన్ని కోర్సుల ఫలితాలు త్వరలోనే రానున్నాయి. ఇప్పటికైనా సర్కారు స్పందించి ఫీజు బకాయిలు విడుదల చేయాలని స్టూడెంట్స్ యూనియన్స్ డిమాండ్ చేస్తున్నాయి.
సంజయ్గౌడ్.. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో 2019లో డిగ్రీ కంప్లీట్ చేశాడు. ఫస్టియర్లో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ రిలీజ్ అయింది. ఆ తర్వాత సెకండ్, ఫైనల్ ఇయర్లో ఫీజులు రాలేదు. దీంతో సర్టిఫికెట్లు కాలేజీలోనే ఉండిపోయాయి. ఫీజులు కడితేనే ఇస్తమంటున్నరు. డబ్బులు లేకపోవడంతో సంజయ్గౌడ్ సర్టిఫికెట్లు తీసుకోలేదు. అదే టైంలో ఐసెట్ రాశాడు. మంచి ర్యాంకు కూడా వచ్చింది. కానీ సర్టిఫికెట్లు లేకపోవడంతో స్టడీ ఆపేయాల్సి వచ్చింది.