
- సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో ఘటన
చందుర్తి, వెలుగు : తాగుడుకు బానిసై, తరచూ కుటుంబసభ్యులతో గొడవ పడుతున్న తండ్రిని.. ఓ కొడుకు కారుతో ఢీకొట్టి చంపేశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవునితండాలో సోమవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తండాకు చెందిన జాకో తిరుపతినాయక్ (42) తాగుడుకు బానిసై, కుటుంబ సభ్యులతో గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో మూడు రోజుల కింద ఇంట్లో ఉన్న రూ. 10 వేలను తీసుకొని బయటకు వెళ్లిన తిరుపతినాయక్ తర్వాత తిరిగొచ్చాడు. సోమవారం మధ్యాహ్నం పొలం వద్ద నుంచి ఇంటికి వచ్చి... డబ్బులు ఇవ్వాలని భార్యతో గొడవకు దిగాడు.
డబ్బులు లేవని చెప్పడంతో ఆమెపై దాడికి దిగాడు. తల్లిపై తండ్రి దాడి చేస్తుండడాన్ని గమనించిన కూతురు లావణ్య.. ఈ విషయాన్ని తన సోదరుడు రాజేశ్కు ఫోన్లో చెప్పింది. దీంతో కారులో ఇంటికి వచ్చిన రాజేశ్.. ఇంటి ఎదుట రోడ్డుపై నిల్చున్న తండ్రి తిరుపతినాయక్ను కారుతో రెండు, మూడు సార్లు ఢీకొట్టాడు. గమనించిన స్థానికులు ఘటనాస్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడ్డ తిరుపతినాయక్ను 108లో వేములవాడ తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడి అన్న రాములునాయక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.