ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య

ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
  • హనుమకొండలో ఒకరు..బెల్లంపల్లిలో మరొకరు 
  • నక్కలగుట్ట సువిద్య కాలేజీ ఎదుట ఆందోళన
  • ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం

హనుమకొండ, వెలుగు : ఇంటర్​ పరీక్ష రాసి వచ్చిన ఇద్దరు స్టూడెంట్స్​ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని ఓ ప్రైవేట్​కాలేజీలో చదువుతున్న జూనియర్​ ఇంటర్​ స్టూడెంట్ హాస్టల్ గదిలో సూసైడ్​ చేసుకోగా, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన సీనియర్​ ఇంటర్ ​విద్యార్థి ఇంట్లో ఉరేసుకున్నాడు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామానికి చెందిన మురారిశెట్టి సంధ్య-, సమ్మయ్య దంపతుల పెద్ద కూతురు నాగజ్యోతి(16) నక్కలగుట్టలోని సువిద్య జూనియర్ కాలేజీ హాస్టల్​లో ఉంటూ బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. బుధవారం పరీక్షలు స్టార్ట్ కాగా.. రాసి వచ్చింది. సాయంత్రం కాలేజీలో స్టడీ అవర్ లో మరుసటి రోజు ఎగ్జామ్​ కోసం చదివింది. రాత్రి 7 గంటలకు తన గదికి వెళ్లింది. ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో స్టూడెంట్స్​వెళ్లి చూడగా..సీలింగ్​కు చున్నీతో ఉరి వేసుకుని కనిపించింది. సిబ్బంది, కాలేజ్ ​మేనేజ్​మెంట్ అక్కడికి వచ్చి చున్నీని కట్​చేసి నాగజ్యోతిని కిందికి దించారు. రామ్​నగర్​లోని ఓ ప్రైవేటు దవాఖానకు, అక్కడి నుంచి ఎంజీఎంకు తీసుకెళ్లగా నాగజ్యోతి అప్పటికే చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో కాలేజీ యాజమాన్యం అక్కడి నుంచి పరారైంది.  

కాలేజ్​ ఎదుట స్టూడెంట్​ యూనియన్ల ఆందోళన

నాగజ్యోతి చనిపోవడంతో ఆమె పేరెంట్స్​, విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ గేటు ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగజ్యోతి మరణంపై తమకు అనుమానాలున్నాయని, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం నుంచి స్పందన లేకపోవడంతో కాలేజీలోని ఫర్నిచర్, అద్దాలు, బోర్డు ధ్వంసం చేశారు. ఏసీపీ కిరణ్​కుమార్, సుబేదారి, హనుమకొండ, కేయూ సీఐలు షుకూర్​, శ్రీనివాస్​ జీ, దయాకర్ అక్కడికి వచ్చి సర్ది చెప్పారు. అయినా వినకపోవడంతో కొంతమంది స్టూడెంట్లను అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించారు. బాధిత తల్లిదండ్రులు సాయంత్రం వరకు అక్కడే బైఠాయించగా.. చివరకు ప్రజాప్రతినిధులు, పోలీసుల చొరవతో ఆందోళన విరమించారు.

సంస్కృతం పరీక్ష బాగా రాయలేదని.. 

బెల్లంపల్లి:  పరీక్ష బాగా రాయలేదని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కాల్ టెక్స్ ఏరియాకు చెందిన ఓ స్టూడెంట్​ ఆత్మహత్య చేసుకున్నాడు. రాపెల్లి శంకర్, శారద కొడుకు శివకృష్ణ(18) గురువారం ఇంటర్ సెకండ్ ఇయర్ సంస్కృతం పరీక్ష రాశాడు. తల్లిదండ్రులకు, ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి  పరీక్ష బాగా రాయలేదని బాధపడ్డాడు. ఇంటికి వెళ్లాక పేరెంట్స్​ లేకపోవడంతో ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకున్నాడు. బెల్లంపల్లి టూటౌన్ ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.