హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రోజురోజుకు చలి పెరుగుతోంది. నివర్ తుఫాను తర్వాత చలి మరింత పెరిగింది. పగటి వేళల్లోనూ చలి పెడుతోంది. సాయంత్రం 6 దాటగానే చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు మంచు దట్టంగా కురుస్తోంది. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొన్ని చోట్ల 2 నుంచి 4 డిగ్రీలు, మరికొన్ని చోట్ల 5 డిగ్రీలు తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు నిర్మల్లో 15.9, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్లలో 16.2, నిజామాబాద్లో 16.6, కామారెడ్డిలో 16.7, కుమ్రంభీం ఆసిఫాబాద్లో 17.1, జగిత్యాలలో 17.4, హైదరాబాద్లో 18.6 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హిందూ మహాసముద్రం, అండమాన్ సముద్ర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం ఆదివారం తీవ్ర అల్పపీడనంగా మారిందని, సోమవారం తీవ్ర వాయుగుండంగా మారవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.