
ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తర్వాత ఇండియాలో జరుగుతున్న పరిణామాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఇండియా డెవలప్మెంట్స్ను అమెరికా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తోంది. లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసీ) దగ్గర శాంతియుతంగా ఉండాలని ఇండియా, పాకిస్తాన్ను అమెరికా కోరింది. జమ్మూకాశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘనపై తమ దేశం ఆందోళన చెందుతోందని యూఎన్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మోర్గాన్ ఒర్గాగుస్ చెప్పారు. అమెరికా పేపర్లు కూడా జమ్మూకాశ్మీర్ పరిణామాలపై ఫోకస్ పెట్టాయి. ఆరాష్ట్రానికి స్పెషల్
స్టేటస్ రద్దుపై న్యూయార్క్ టైమ్స్ లీడ్ ఎడిటోరియల్ రాసింది. ‘‘ప్రాంతీయ సంక్షోభం’’లోకి కూరుకుపోకుండా జమ్మూకాశ్మీర్ను ఆపాలని అమెరికా, చైనా, యునైటెడ్ నేషన్స్ను ఆ ఎడిటోరియల్
సూచించింది.
ఓర్పు పాటించండి: యూఎన్ సెక్రటరీ జనరల్
ఇండియా, పాకిస్తాన్ రెండూ ఓర్పుతో వ్యవహరించాలని యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెర్రెస్ కోరారు. కాశ్మీర్లో పరిణామాలను సెక్రటరీ జనరల్ పరిశీలిస్తున్నట్టు ఆయన ప్రతినిధి స్టెఫానె డుజార్రిక్ చెప్పారు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు కీలకమైన పాత్ర పోషిస్తారా అన్న మీడియా ప్రశ్నకు… రెండు దేశాలు కోరితే తానెప్పుడూ రెడీనే అని అంటోనియా చెప్పారన్నారు.
మా దేశానికి సపోర్ట్ చేయరూ!
జమ్మూకాశ్మీర్కు స్పెషల్ రద్దు నిర్ణయం తీసుకున్న ఇండియాకు పూర్తి మద్దతు ఇవ్వాలని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను ఇండియన్-అమెరికన్లు కోరారు. బోర్డర్లో టెర్రరిజానికి మద్దతు ఇవ్వకుండా పాకిస్తాన్పై ఒత్తిడి పెంచాలని కూడా వాళ్లు కోరారు. దీనివల్ల కాశ్మీర్ సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని హిందూ అమెరికన్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ కల్రా చెప్పారు. స్పెషల్ స్టేటస్ రద్దు నిర్ణయం దేశానికి మోడీ ఇచ్చిన స్వాతంత్య్ర దినోత్సవ కానుక అని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి అన్నారు. మోడీ సర్కార్ నిర్ణయాన్ని అభినందిస్తూ రానున్న రెండు వారాల్లో సెలబ్రేషన్లు జరుపుతామని ఆయన చెప్పారు.
కాశ్మీరు పండిట్ల ఆనందం
అమెరికాలో ఉంటున్న కాశ్మీరు పండిట్లు కూడా మోడీ సర్కార్ నిర్ణయంపై ఆనందం వ్యక్తంచేస్తున్నారు. తాజా నిర్ణయంతో భవిష్యత్తులో సొంత వూళ్లకు తిరిగి వెళ్లగలుగుతామని ఇండో-అమెరికన్ కాశ్మీర్ ఫోరానికి చెందిన విజయ్ సజావల్ చెప్పారు.లండన్, జెనీవాలో ఉన్న ఇండో-యూరోపియన్ కాశ్మీర్ ఫోరమ్, ఒట్టావాలోని ఇండో-కెనేడియన్ కాశ్మీర్ ఫోరమ్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. మరోవైపు, కాశ్మీర్లో ఇంటర్నెట్, కమ్యునికేషన్ సర్వీసుల్ని పునరుద్ధరించాలని అమెరికాలో జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడుతున్న కమిటీ (టు ప్రొటెక్ట్ జర్నలిస్టు) ఇండియాను కోరింది.