- ప్రధాని మోదీ-రాబర్ట్ ఫికో చర్చల తర్వాత కీలక నిర్ణయం
- డిఫెన్స్, డిజిటల్ టెక్నాలజీ, కార్మిక వలసలు, విద్య రంగాల్లో డీల్స్
బ్రాటిస్లావా: భారత్–స్లోవేకియా ద్వైపాక్షిక సంబంధాలు కొత్త దశలోకి ప్రవేశించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో మధ్య సోమవారం జరిగిన చర్చల అనంతరం రెండు దేశాలు తమ సంబంధాలను “సమగ్ర భాగస్వామ్యం” స్థాయికి అప్గ్రేడ్ చేశాయి. ఈ సందర్భంగా రక్షణ, డిజిటల్ టెక్నాలజీ, కార్మిక వలసలు, ఉన్నత విద్య, క్వాంటం కమ్యూనికేషన్ తదితర రంగాల్లో 11 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
భారత్–యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం మోదీ మాట్లాడుతూ.. రెండు దేశాలకు ఉమ్మడి విలువలు, ఉమ్మడి ప్రాధాన్యతలు, ఉమ్మడి భవిష్యత్తు ఉన్నాయని అన్నారు. ఆటోమొబైల్, రైల్వేలు, ఆధునిక తయారీ, గ్రీన్ టెక్నాలజీ రంగాల్లో కలిసి పనిచేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇంధన భద్రత, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలతో అణుశక్తి, జియోథర్మల్ విద్యుత్ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు అంగీకరించారు. రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య ఉన్న పరస్పర విశ్వాసానికి నిదర్శనంగా రక్షణ సహకారంపై లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఖరారైందని చెప్పారు.స్టార్టప్లకు, పరిశ్రమలకు లాభంభారత్–ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలుతో రెండు దేశాల పరిశ్రమలు, స్టార్టప్లు, వ్యాపార వర్గాలు గణనీయంగా లాభపడతాయని మోదీ పేర్కొన్నారు.
ఈ ఒప్పందాన్ని అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఫికో హామీ ఇచ్చారు. ప్రపంచ వేదికపై కూడా భారత్, స్లోవేకియా సన్నిహిత సమన్వయంతో ముందుకు సాగాలని, వివాదాలను శాంతియుత మార్గాల్లోనే పరిష్కరించాలని ఇరు దేశాధినేతలు అభిప్రాయపడ్డారు. 21వ శతాబ్దపు సవాళ్లకు అనుగుణంగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో రిఫామ్స్అవసరమని పేర్కొన్నారు.
ఇండో–పసిఫిక్ రీజియన్ ప్రాధాన్యతను గుర్తిస్తూ రీజనల్కనెక్షన్స్, స్వేచ్ఛా వాణిజ్యం, సముద్ర రవాణా స్వేచ్ఛ, శాంతియుత పరిష్కారాలకు మద్దతు ప్రకటించారు. కార్మిక వలసల రంగంలో కూడా కీలక పురోగతి నమోదైంది. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల చట్టబద్ధంగా సేఫ్ ట్రావెల్ను ఈజీ చేయడానికి కార్మిక వలసలపై అవగాహన ఒప్పందం కుదిరింది. అలాగే రెండు దేశాల్లో పనిచేసే వృత్తి నిపుణుల సంక్షేమం కోసం సోషల్సెక్యూరిటీ అగ్రిమెంట్ త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు.
మోదీకి ఘన స్వాగతం
మోదీ స్లోవేకియా పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. 1993లో స్లోవేకియా స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత అక్కడికి వెళ్లిన తొలి భారత ప్రధాని మోదీయే. ఫ్రాన్స్ పర్యటన అనంతరం బ్రాటిస్లావా చేరుకున్న ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు.
