భారత్ vs ఆస్ట్రేలియా: నేడే తొలి టీ20

భారత్ vs ఆస్ట్రేలియా: నేడే తొలి టీ20

విశాఖ వేదికగా జరిగే భారత్, ఆస్ట్రేలియా టీ-20 మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. మ్యాచ్ లో గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. మ్యాచ్ ను ఎంజాయ్ చేసేందుకు అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ్యాచ్ కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ టూర్ లో భారత్ తో రెండు టీ20లు, 5 వన్డేలు ఆడనుంది ఆస్ట్రేలియా. మ్యాచ్ లో గెలిచి శుభారంభం చేయాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. తమ అభిమాన క్రికెటర్ల ఆటను చూసేందుకు ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

న్యూజిలాండ్ సిరీస్ లో విశ్రాంతి తీసుకున్న విరాట్  కోహ్లీ, బుమ్రా ఈ సిరీస్ లో టీమ్ లోకి రావడంతో టీమిండియా పటిష్టంగా కనిపిస్తోంది. దినేష్ కార్తీక్, కేఎల్ రాహుల్ ఇద్దరిలో ఒకరు ప్లేయింగ్ లెవన్ లో ఉండే అవకాశం ఉంది. వెన్నునొప్పితో  సిరీస్ కు దూరమైన  ఆల్ రౌండర్  హార్దిక్  పాండ్యా.. స్థానంలో విజయ్ శంకర్ కు అవకాశం దక్కనుంది. యువ బ్యాట్స్ మన్  పంత్ పై కూడా భారీ అంచనాలున్నాయి. అటు బిగ్ బాష్ లీగ్ లో అదరగొట్టిన ఆరుగురు ఆటగాళ్లతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది.

యార్కర్ స్పెషలిస్ట్ బుమ్రా తిరిగి రావటంతో భారత్ బౌలింగ్ బలం పెరిగింది. భువనేశ్వర్ కు టీ20లతో పాటు తొలి రెండు వన్డేలకు విశ్రాంతి ఇవ్వగా… అతని స్థానంలో ఉమేశ్ యాదవ్ బరిలో దిగనున్నాడు. గత సిరీస్ ల్లో రాణించిన స్పిన్నర్లు చాహల్, కృనాల్ పాండ్యాలను కొనసాగించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా బౌలింగ్ లో స్టార్ పేసర్ స్టార్క్ జట్టుకు దూరం కాగా ఆ స్థానాన్ని కమిన్స్  భర్తీ చేయనున్నాడు. జంపా, కేన్ రిచర్డ్ సన్, కౌల్టర్ నైల్ లతో ఆసీస్ బౌలింగ్ కూడా బలంగా ఉంది.

విశాఖ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్  కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు సీపీ మహేష్ చంద్ర లడ్డా. అటు ప్లేయర్లకు సంబంధించిన రక్షణ చర్యలు తీసుకున్నామని చెప్పారు.

పుల్వామా దాడి నేపథ్యంలో ప్రపంచకప్ లో పాక్ తో మ్యాచ్ పై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. పుల్వామా దాడిని మరోసారి ఖండించాడు. ప్రజల మనోభావాలకు… బీసీసీఐ, భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పాడు.

గతంలో విశాఖలో జరిగిన 10 మ్యాచుల్లో 8 మ్యాచులు గెలిచిన టీమిండియా.. ఇవాళ్టి మ్యాచ్ లోనూ విజయంపై ధీమాగా ఉంది. ఇక ఈ మ్యాచ్ లో మరో రెండు సిక్సర్లు కొడితే రోహిత్ శర్మ టీ20ల్లో అత్యధిక సిక్స్ లు కొట్టిన బ్యాట్స్ మెన్ గా నిలవనున్నాడు. అటు బుమ్రా కూడా రెండు వికెట్లు తీస్తే భారత్ తరపున టీ20ల్లో 50 వికెట్లు తీసిన రెండో బౌలర్ అవుతాడు. 52 వికెట్లతో తొలి స్థానంలో అశ్విన్ ఉన్నాడు.