
రికార్డు ధరలు ఉన్నప్పటికీ, కిందటి ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో బంగారం డిమాండ్ 782 టన్నులకు చేరింది. కరోనా ముందుస్థాయి యావరేజ్ కంటే 15 శాతం ఎక్కువగా ఉంది. నగలకు డిమాండ్ కాస్త తగ్గినప్పటికీ, బంగారం బార్స్, కాయిన్లలో పెట్టుబడులు పెరిగాయి. కిందటి ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ఇన్వెస్టర్లు వీటిలో చేసిన పెట్టుబడుల విలువ ఏడాది లెక్కన 25 శాతం పెరిగింది. 2024 మధ్యలో కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం 15శాతం నుంచి 6 శాతానికి తగ్గించడం దీనికి సపోర్ట్ చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారం డిమాండ్ 725 టన్నుల దగ్గర ఉంటుందని యూబీఎస్ అంచనా వేస్తోంది. 2026–27 లో గృహ వినియోగం నిలకడగా ఉంటుందని, ఫలితంగా గోల్డ్ డిమాండ్ 800 టన్నులకు చేరుతుందని లెక్కించింది. ఫిజికల్ సేవింగ్స్, ముఖ్యంగా రియల్ ఎస్టేట్, బంగారంలో ఇన్వెస్ట్మెంట్లు పెరగడం ఇందుకు కారణమని తెలిపింది.
ఫైనాన్షియల్ కంపెనీ యూబీఎస్ ప్రకారం.. 2019–20 నుంచి బంగారం ధరలు రెట్టింపు అయ్యాయి. దీనితో భారతీయ గృహ ఆస్తుల విలువ కూడా బాగా పెరిగింది. 2026 నాటికి బంగారం ధర ఔన్స్ (28 గ్రాముల)కు 3,500 డాలర్లకు చేరుతుందని అంచనా. ఇందుకు ట్రేడ్ టెన్షన్స్, ద్రవ్యోల్బణం, జియోపొలిటికల్ రిస్క్లు కారణం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో బంగారం వాల్యూమ్ డిమాండ్ కాస్త తగ్గినప్పటికీ, ఎక్కువ ధరల వల్ల నెట్ ఇంపోర్ట్స్ విలువ 55–60 బిలియన్ డాలర్ల (జీడీపీలో 1.2శాతం)కు చేరుకునే అవకాశం ఉంది.