ఇండియా కార్పోరేట్లు జమీందార్లను మించిపోయారు.. వీళ్లతో 20 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అసాధ్యం: నవమ్ క్యాపిటల్ ఎండీ

ఇండియా కార్పోరేట్లు జమీందార్లను మించిపోయారు.. వీళ్లతో 20 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అసాధ్యం: నవమ్ క్యాపిటల్ ఎండీ

ఇండియన్ కార్పోరేట్లపై నవమ్ క్యాపిటల్ ఎండీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. భారత దేశంలోని వ్యాపార సంస్థలపై చేసిన తీవ్ర విమర్శలపై ఇప్పుడు దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కార్పోరేట్ ప్రపంచం పాత కాలపు జమీందార్లలా పనిచేసే  కొన్ని వంశపారంపర్య కుటుంబాల నియంత్రణలోనే ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

భారత వ్యాపార రంగం చిన్న చిన్న సమూహాలకు చెందిన కొన్ని వంశాల  చేతిలో ఉందని.. చిన్న సమూహాలైనా మొత్తం వ్యాపారాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని నియంత్రిస్తున్నారని విమర్శించారు. ఈ చిన్న సమూహాలు ఒకరితో మరొకరు వివాహ బంధాలతో ముడిపడి ఉన్నట్లు పేర్కొన్నారు.  ఇది పాతకాలపు జమీందార్లలా పనిచేసే ఒక క్లోజ్డ్ సర్కిల్ అని జూన్ 03న ఎక్స్ లో పోస్ట్ చేశారు.  కోటక్ బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా.. ప్రస్తుత కార్పోరేట్ వ్యవస్థ ఆధిపత్యాన్ని వివరిస్తూ ట్వీట్ చేశారు. 

ఇండియా  అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలని కలలు కంటున్నారని.. కానీ ఇలాంటి జమీందార్ల మాదిరిగా ఆలోచించే వారితో ఆ ఆశయం నెరవేరదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆశయాలకు మద్ధతు ఇచ్చే స్థితిలో దేశంలోని ప్రస్తుత కార్పొరేట్ నిర్మాణం లేదని విమర్శించారు.  21వ శతాబ్దపు జమీందార్లు భారత ఆర్థిక వ్యవస్థ ను 20 ట్రిలియన్ల డాలర్లకు ఎదిగేందుకు సహాయపడతారని ఆశించలేమన్నారు. 

 ఈ సమస్య కేవలం ఓనర్షిప్ స్ట్రక్చర్ వరకే పరిమితం కాలేదని..  అనేక కంపెనీలు ఎలా పనిచేస్తాయనే దానికి ముడిపడి ఉందన్నారు. దోపిడీ మనస్తత్వం, కంపెనీల మోసపూరిత విధానం, లైసెన్స్ రాజ్ ధోరణి భారత అభివృద్ధికి పెద్ద సవాల్ గా మారిందని అన్నారు. 

ఇండియా ప్రపంచంతో పోటీ పడుతూ అభివృద్ధిలో దూసుకుపోవాలంటే.. ఇప్పుడున్న వ్యాపార సామ్రాజ్యాలను అధిగమించేలా కొత్త సంస్థలు రావాలన్నారు. ఇప్పుడున్న వాటి మోనోపొలీని నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం మరింత పోటీ, సులభమైన మార్గాలు ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు. 30 ఏళ్ల క్రితం, ఆర్థిక సంస్కరణలు తెచ్చినప్పుడు ఇదే జరిగిందని గుర్తుచేశారు.

ఆర్థిక సరళీకరణ తర్వాత భారత పాత కార్పొరేట్ వ్యవస్థను కదలించిన అనేక కంపెనీలు.. మళ్లీ పాత పద్ధతినే పాటిస్తూ పాతుకుపోయాయని.. కొత్త కంపెనీలకు, ఆంత్రప్రెన్యూవర్లకు అవకాశం ఇవ్వకుండా ఆధిపత్యం కొనసాగిస్తున్నాయని అన్నారు. ప్రస్తుత కార్పొరేట్ దిగ్గజాలలో చాలా వరకు ఆ కాలంలోని బ్లూ-చిప్ కంపెనీలను పునాదులను కదిలించినవే. కానీ - కాలక్రమేణా, అప్పట్లో సవాళ్లు విసిరిన సంస్థలు, తాము తొలగించిన పాత తరం వారిలాగే తయారయ్యాయి అని కీలక వ్యాఖ్యలు చేశారు. 

కొత్త కంపెనీల ఏర్పాటుకు అడ్డంకులు,  విస్తరణకు ఉన్న అవరోధాలు వ్యాపార రంగంలో వచ్చే సహజ మార్పును అడ్డుకుంటున్నట్లు చెప్పారు. భవిష్యత్ ఆర్థిక పురోగతిని మరిన్ని సంస్కరణలతో ముడిపెడుతూ, కొత్త తరం పారిశ్రామికవేత్తలు ఇప్పటికే ఉన్న సంస్థలను సవాలు చేయడానికి  ప్రోత్సాహం అవసరమని మంత్రి అన్నారు. 

ఇండియా ప్రోగ్రెస్ కు  ఆటంకం కలిగిస్తూ..  తిష్టవేసుకు కూర్చున్న వ్యాపారులను కాదని.. కొత్త తరం వ్యాపారవేత్తలు అవతరించేందుకు అవసరమైన సంస్కరణలను ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తారని ఈ తరం భారతీయులు ఆశిస్తున్నారని.. అలాంటి సంస్కరణలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. 

  • ఉదయ్ కోటక్ ట్వీట్ తో మొదలైన చర్చ:

ప్రపంచ టెక్ కంపెనీలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భారీ పెట్టుబడులు పెడుతున్నాయని.. అందుకు గూగుల్ 80 బిలియన్ల డాలర్ల పెట్టుబడులే ఉదాహరణగా కోటక్ బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ అంతకు ముందు ట్వీట్ చేశారు. ఇండియన్స్ వ్యాపారంపై దృష్టి సారించాలని, భవిష్యత్తులో దూకుడుగా పెట్టుబడులు పెట్టాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

గూగుల్ యానువల్ ప్రాఫిట్ 160 బిలియన్ డాలర్లు, లాస్ట్ క్వార్టర్ లో 62 బిలియన్ డాలర్లు, మార్కెట్ క్యాప్ 4.5 ట్రిలియన్ డాలర్లు అని ఉదయ్ కోటక్ అన్నారు. ఇది ఇండియాలోని అన్ని లిస్టెడ్ కంపెనీల మొత్తం లాభాలు, మార్కెట్ క్యాప్‌కు దాదాపు సమానమని పేర్కొన్నారు. 

మిగులు ఆదాయంలో నుంచి 80 బిలియన్ డాలర్లు సమీకరించి భవిష్యత్ పెట్టుబడులకు సిద్ధమవుతోందని.. భవిష్యత్తులో పెట్టుబడి పెట్టేందుకు ఇది అన్ని కంపెనీలకు ఒక హెచ్చరిక అని ఎక్స్ లో పోస్టు చేశారు.