సింధూ జలాలపై పాక్ కు టెన్షన్

సింధూ జలాలపై పాక్ కు టెన్షన్
  • వరుస లేఖలతో భారత్​కు విజ్ఞప్తులు 
  • ఒప్పందం రద్దుపై పునరాలోచన చేయాలంటూ పదే పదే విన్నపాలు 

న్యూఢిల్లీ: సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారత్ నీటిని కట్టడి చేస్తే తమకు తీవ్ర నీటి ఎద్దడి తప్పదన్న ఆందోళనలో ఉన్న దాయాది దేశం.. ఒప్పందంపై పునరాలోచన చేయాలంటూ పదే పదే విజ్ఞప్తులు చేస్తోంది. ఈ అంశంపై పాకిస్తాన్ ఇప్పటివరకూ నాలుగు లేఖలు రాసిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ తో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో పాక్ కు టెన్షన్ మొదలైంది.

 ఆ దేశంలోని ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో ఇండియా చేపట్టిన దాడులకు ముందుగా మే మొదటి వారంలో ఓ లేఖ రాసిన పాకిస్తాన్.. ఆ దాడుల తర్వాత మరో మూడు లేఖలు రాసింది. ఇప్పటివరకూ పాక్ జలవనరుల శాఖ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తజా నుంచి కేంద్ర జలశక్తి శాఖ, విదేశాంగ శాఖకు మొత్తం 4 లేఖలు అందాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సింధూ జలాల ఒప్పందం రద్దు అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని.. నీటిని నిలిపివేస్తే తమ దేశంలో తీవ్ర కరువు ఏర్పడుతుందని ఆ లేఖల్లో పాక్ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై చర్చించుకుందాం అంటూ విన్నవించినట్టుగా సమాచారం. 

బియాస్ నీటి మళ్లింపునకు కేంద్రం చర్యలు   

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ పై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. టెర్రరిస్టులను ఎగదోస్తున్న ఆ దేశంతో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని, ఇతర దౌత్య సంబంధాలనూ తెంచుకుంటున్నామని ప్రకటించారు. ‘‘వాణిజ్యం, ఉగ్రవాదం.. నీళ్లు, రక్తం.. బుల్లెట్లు, చర్చలు కలిసి సాగలేవు” అని ఆయన తేల్చిచెప్పారు. మరోవైపు సింధూ నదీ వ్యవస్థలో కీలకమైన బియాస్ నది నుంచి గంగ, యమున నదులకు నీటిని మళ్లించే గంగా కెనాల్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని నిర్ణయించారు. సింధూ జలాల ఒప్పందం నుంచి వైదొలగడంతోపాటు ఆ వ్యవస్థలోని ఆరు నదుల నీటిని భారత్ కట్టడి చేయనుంది. దీంతో పాకిస్తాన్ లోని సింధ్, పంజాబ్ ప్రావిన్స్ లలో ప్రధానంగా రబీ సీజన్ లో తీవ్ర నీటి కొరత ఏర్పడనుండటంతో ఆ దేశం ఈ విషయంలో పదే పదే లేఖలు రాస్తున్నట్టు భావిస్తున్నారు.