తలసరి ఆదాయం @4,000 డాలర్లు.. 2030 నాటికి పెరుగుతుందని అంచనా

తలసరి ఆదాయం @4,000 డాలర్లు.. 2030 నాటికి పెరుగుతుందని అంచనా
  • 2030 నాటికి పెరుగుతుందని అంచనా
  • ఈ విషయంలో తెలంగాణ నంబర్​వన్​

న్యూఢిల్లీ: మనదేశ ప్రజల తలసరి ఆదాయం 2023 ఆర్థిక సంవత్సరం నాటికి 2,450 డాలర్ల (దాదాపు రూ.2,01,536) నుంచి 2030 ఆర్థిక సంవత్సరం నాటికి దాదాపు 70 శాతం పెరిగి  నాలుగు వేల డాలర్ల (దాదాపు రూ.3,29,039)వరకు పెరిగే అవకాశం ఉంది.   ఆరు -ట్రిలియన్ డాలర్ల జీడీపీతో మధ్య- ఆదాయ ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. ఇందులో సగానికి పైగా మొత్తం గృహ వినియోగం నుంచి వస్తుందని ఒక రీసెర్చ్​ రిపోర్ట్​ పేర్కొంది.  తలసరి ఆదాయం 2001 ఆర్థిక సంవత్సరంలో  460 డాలర్ల నుంచి 2011 ఆర్థిక సంవత్సరంలో  1,413 డాలర్లకు,  2021 ఆర్థిక సంవత్సరంలో  2,150 డాలర్లకు పెరిగింది. జీడీపీ పెరుగుదలకు విదేశీ వాణిజ్యం ఎంతగానో తోడ్పడుతుందని అంచనా. ఇది 2030 నాటికి  1.2 ట్రిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి  2.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. 2023 ముగిసే నాటికి జీడీపీ  3.5 ట్రిలియన్​ డాలర్లకు చేరుతుందని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ రిపోర్ట్​పేర్కొంది. దీని ప్రకారం...ఇక నుంచి జీడీపీ ఏటా 10 శాతం పెరుగుతుంది.  గృహ వినియోగం 2030 ఆర్థిక సంవత్సరం నాటికి  3.4 ట్రిలియన్​ డాలర్లకు పెరుగుతుంది. -ఇది ప్రస్తుత జీడీపీకి సమానం. 2023 ఆర్థిక సంవత్సరంలో ఇది 2.1 ట్రిలియన్  డాలర్ల ఉండగా, ఇది జీడీపీలో 57 శాతానికి సమానం. ఇదే విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతవారం మాట్లాడుతూ తన తదుపరి పదవీ కాలం ముగిసేలోపు మన ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు ఎదిగేలా చూస్తానని ప్రకటించారు. దీంతో అమెరికా,  చైనా తర్వాత మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే అవుతుంది. ప్రస్తుతం జపాన్ మూడో స్థానంలో, జర్మనీ నాలుగో స్థానంలో ఉన్నాయి.

పెరగనున్న తొమ్మిది రాష్ట్రాల జీడీపీ

 దాదాపు తొమ్మిది రాష్ట్రాల తలసరి ఆదాయం నాలుగు వేల డాలర్ల సమీపానికి వస్తోంది. ఇవి ఎగువ మధ్యతరగతి ఆదాయ  స్థితికి ఎదుగుతున్నాయి.   ప్రస్తుతం తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2,75,443 లేదా  3,360 డాలర్లతో ముందుంది. తరువాతి స్థానాల్లో కర్ణాటక (రూ. 2,65,623), తమిళనాడు (రూ. 2,41,131), కేరళ (రూ. 2,30,601)  ఆంధ్రప్రదేశ్ (రూ.2,07,771) ఉన్నాయి. అయితే 2030 ఆర్థిక సంవత్సరం నాటికి గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ విషయంలో ముందంజలో ఉండనుంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, హర్యానా, తెలంగాణ,  ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాతి స్థానాల్లో ఉంటాయని స్టాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ నివేదిక పేర్కొంది. తెలంగాణ, ఢిల్లీ, కర్నాటక, హర్యానా, గుజరాత్,  ఆంధ్రప్రదేశ్‌‌‌‌లకు ​జాతీయ జీడీపీలో 20 శాతం వాటా ఉంది.  2030 ఆర్థిక సంవత్సరం నాటికి తలసరి జీడీపీ  ఆరు వేల డాలర్లుగా ఉంటుంది. జనాభాలో 25 శాతం ఉన్న పెద్ద రాష్ట్రాలు యూపీ,  బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తలసరి ఆదాయం 2030 ఆర్థిక సంవత్సరంలో కూడా రెండువేల డాలర్ల కంటే తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం గృహ వినియోగ వ్యయం వీటి  జీడీపీలో 57 శా తంగా ఉంది. దీని వాటా ఒక శాతం తగ్గినా, వినియోగదారుల మార్కెట్ పరిమాణం భారీగా తగ్గుతుంది. 2020లో దేశంలో పని చేసే వయసు ఉన్న  జనాభా వాటా 64.2 శాతంగా ఉంది. ఇది  2040లో 63.6 శాతానికి,  2050లో 61.1 శాతానికి తగ్గవచ్చు.  శ్రామిక సామర్థ్యం, మూలధన విస్తరణ,  పని చేసే  వయస్సు,  జనాభాలో  నిరంతర పెరుగుదల  ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తాయని రిపోర్ట్​ పేర్కొంది.