జొహర్బహ్రు (మలేసియా): సుల్తాన్ జొహర్ కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్లో ఇండియా ఫైనల్ చేరింది. గత మ్యాచ్లో జపాన్ చేతిలో ఓటమి నుంచి వెంటనే తేరుకున్న మన కుర్రాళ్లు బుధవారం జరిగిన పోరులో 5–1తో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి టైటిల్ ఫైట్కు క్వాలిఫై అయ్యారు. షీలానంద్ లక్రా (26, 29 నిమిషాల్లో) డబుల్ గోల్స్ చేసి టీమ్ విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. దిల్ప్రీత్ సింగ్ (44వ ని.), గుర్సాహిబ్ సింగ్ (48వ ని.), మన్దీప్ మొర్ (50వ ని.) తలో గోల్ సాధించారు.
ఫస్ట్ క్వార్టర్లో ఇరు జట్లు మిడ్ఫీల్డ్ను కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ట్రై చేశాయి. సెకండ్ క్వార్టర్లో కౌంటర్ అటాకింగ్ మొదలు పెట్టిన ఇండియా రిజల్ట్ రాబట్టింది. దిల్ప్రీత్ సింగ్ పర్ఫెక్ట్ పాస్కు ఆసీస్ మొత్తం డిఫెన్స్ను దాటి సర్కిల్లో తన ముందు పడ్డ బాల్ను నెట్లోకి పంపిన లక్రా ఇండియాకు తొలి గోల్ అందించాడు. అక్కడి నుంచి ఇండియా క్రమం తప్పకుండా స్కోరు చేసింది. శుక్రవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్ లో గ్రేట్ బ్రిటన్తో తలపడనుంది.