నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. జిల్లాలోని ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి రహదారి సమీపంలోని రోడ్డు ప్రక్కన ఓ పౌల్ట్రీ ఫార్మ్ దగ్గర చిరుత సంచరించింది. అయితే.. అదే సమయంలో కుక్కలు అరవడంతో వెనుదిరిగింది చిరుత. చిరుత సమాచారంతో చుట్టుపక్కల గ్రామాల వ్యవసాయ కూలీలు, రైతులు, వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.
చిరుత సంచారానికి సంబంధించిన విజువల్స్ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ క్రమంలో పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అటవీశాఖ అధికారులు.
ఒంటరిగా పొలాల వైపు ఎవరు వెళ్ళొద్దని సూచిస్తున్నారు అధికారులు. పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరించినట్లు అనుమానం వచ్చినా కూడా తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు అధికారులు.
