సుజౌ (చైనా): ఏఎఫ్సీ అండర్–17 విమెన్స్ ఆసియా కప్లో ఇండియా ఫుట్బాల్ జట్టు చరిత్ర సృష్టించింది. గ్రూప్–బిలో భాగంగా శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో ఇండియా 4–0తో లెబనాన్పై గెలిచింది. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి క్వార్టర్ఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకుంది. గ్రూప్–సిలో ఫిలిప్పీన్స్, చైనీస్తైపీ మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం ఇండియాకు అనుకూలంగా రావడంతో నాకౌట్ బెర్త్ ఖాయమైంది. ఈ మ్యాచ్లో ఫిలిప్పీన్స్, చైనీస్తైపీలో ఏదో ఓ జట్టు ముందుకెళ్లాలంటే కనీసం 12 గోల్స్ చేయాల్సి ఉంది. కానీ రెండు జట్లూ టార్గెట్ను చేరుకోలేకపోయాయి.
2005 తర్వాత ఈ టోర్నీలో ఇండియాకు ఇదే తొలి విజయం కావడం విశేషం. ఇక లెబనాన్తో జరిగిన మ్యాచ్లో ఇండియా తరఫున ప్రీతిక బర్మన్ (7, 85వ ని), అల్వా దేవి సెంజమ్ (36వ ని), జోయా (72వ ని) గోల్స్ చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఇండియన్ స్ట్రయికర్లు లెబనాన్కు పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఏడో నిమిషంలోనే ప్రీతిక కొట్టిన లెఫ్ట్ ఫుట్ కిక్ గోల్తో ఇండియా ఆధిక్యంలోకి వచ్చేసింది. తొలి హాఫ్లో 2–0 లీడ్లో నిలిచిన ఇండియా రెండో అర్థభాగంలో మరో రెండు గోల్స్ చేసింది. ఈ టోర్నీలో ఇండియా సెమీస్కు చేరుకుంటుంటే 2026 ఫిఫా అండర్–17 వరల్డ్ కప్కు డైరెక్ట్గా అర్హత సాధిస్తుంది.
