
రాజ్గిర్ (బిహార్): ఆసియా కప్ సూపర్–4 స్టేజ్లో ఇండియా గాడిలో పడింది. గురువారం జరిగిన రెండో మ్యాచ్లో ఇండియా 4–1తో మలేసియాపై గెలిచి ఫైనల్కు మరింత చేరువైంది. మన్ప్రీత్ సింగ్ (17వ ని), సుఖ్జీత్ సింగ్ (19వ ని), శైలేంద్ర లక్రా (24వ ని), వివేక్ సాగర్ ప్రసాద్ (38వ ని) ఇండియాకు గోల్స్ అందించగా, హసన్ షఫీక్ (2వ ని) మలేసియా తరఫున ఏకైక గోల్ చేశాడు. స్టార్టింగ్లో డిఫెన్స్లో ఇబ్బందిపడిన ఇండియా తొలి నిమిషంలోనే మలేసియాకు గోల్ ఇచ్చుకుంది.
దీనినుంచి తేరుకోవడానికి కాస్త టైమ్ తీసుకున్నా తర్వాత చెలరేగింది. రెండు వైపుల నుంచి ఫార్వర్డ్స్ పదేపదే ఎదురుదాడులు చేసి అవకాశాలను సృష్టించారు. ఫలితంగా రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ కొట్టి టీమ్ను 2–1 ఆధిక్యంలో నిలిపారు. మరో ఐదు నిమిషాల తర్వాత లక్రా గోల్తో ఆధిక్యం 3–1కి పెరిగింది. ఇక్కడి నుంచి స్కోరును సమం చేసేందుకు మలేసియా ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేదు. చివరి క్వార్టర్లో వచ్చిన పెనాల్టీని వివేక్ సాగర్ గోల్గా మలిచాడు. ఇతర మ్యాచ్ల్లో చైనా 3–0తో డిఫెండింగ్ చాంపియన్ కొరియాకు షాకివ్వగా, బంగ్లాదేశ్ 5–1తో కజకిస్తాన్పై నెగ్గింది.