- న్యూజిలాండ్ టూర్ కు టీమిండియా సెలక్షణ్ నేడు
- ఎమ్మెస్కే ప్రసాద్ కమిటీ ముందు సవాళ్లు
ముంబై : ఫార్మాట్తో సంబంధం లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా న్యూ ఇయర్లో అప్పుడే ఓ సిరీస్ పట్టేసింది. ఆస్ట్రేలియాతో మరో సమరానికి సిద్ధమవుతోంది. అయితే వచ్చేనెల 21న ఈ శతాబ్దంలో తమ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడబోతుంది. ఆసీస్తో మూడు వన్డేల సిరీస్ అనంతరం కోహ్లీసేన న్యూజిలాండ్ వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా అక్కడ ఐదు టీ20లు, మూడు వన్డేల తర్వాత రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ మొదలవుతుంది. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఈ టూర్కు వెళ్లే ఇండియా జట్లను ఆదివారం ఎంపిక చేయనుంది.
గతేడాది హోమ్ సీజన్లో అదరగొట్టిన కోహ్లీసేన వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ టేబుల్లో ప్రస్తుతం టాప్ ప్లేస్లో ఉంది. 2021 జూన్లో జరిగే వరల్డ్ చాంపియన్షిప్ ఫైనల్లో ఇండియా ఉండాలంటే కివీస్లో విజయం కీలకం కానుంది. లిమిటెడ్ ఓవర్ల జట్లలో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేకపోయినా.. టెస్ట్ టీమ్ ఎంపిక విషయంలో మాత్రం ఎమ్మెస్కే కమిటీకి పలు సవాళ్లు ఎదురుకానున్నాయి.
మూడో ఓపెనర్ ఎవరు ?
రోహిత్శర్మ, మయాంక్ అగర్వాల్ జోడీ మంచి పార్ట్నర్షిప్స్తో హోమ్ సీజన్లో అదరగొట్టింది. దీంతో సెలెక్టర్లు మూడో లేదా బ్యాకప్ ఓపెనర్ ఎంపికపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఈ స్థానం కోసం ప్రధానంగా ఇద్దరు పోటీపడుతున్నారు. లిమిటెడ్ ఫార్మాట్లో అదరగొడుతున్న కేఎల్ రాహుల్ రేసులో ముందుండగా, హనుమ విహారి కూడా పోటీలో ఉన్నాడు. వీరిద్దరికీ టాపార్డర్లో రాణించే సత్తా ఉండగా.. సీనియర్ శిఖర్ ధవన్ విషయంలో సెలెక్టర్ల నిర్ణయం చూడాల్సి ఉంది. వీరితో పాటు ఇండియా–ఎ టీమ్ మెంబర్స్ అయిన శుభ్మన్ గిల్, పృథ్వీ షా, ప్రియాంక్ పంచల్, అభిమన్యు ఈశ్వరన్ పేర్లు కూడా చర్చకు వచ్చే చాన్సుంది. ఈ నలుగురిలో ఫేవరెట్ అయిన పృథ్వీ.. భుజం గాయంతో కివీస్ టూర్కు వెళ్లిన ఇండియా–ఎ టీమ్కు దూరమయ్యాడు. వెస్టిండీస్ టూర్తోపాటు స్వదేశంలో జరిగిన విండీస్, బంగ్లాదేశ్ సిరీస్లకు బ్యాకప్ ఓపెనర్గా ఎంపిక చేసిన గిల్కు మరో అవకాశమిస్తారేమో చూడాలి.
ఐదో పేసరా?.. మూడో స్పిన్నరా?
టీమిండియా ఫారిన్ టూర్స్కు సాధారణంగా 16 మంది సభ్యుల జట్టును ఎంపిక చేస్తుంటారు. గతేడాది జులైలో వెస్టిండీస్ టూర్కు కూడా16 మందితోనే వెళ్లారు. అయితే జట్టు ఎంపిక టైమ్లో ఈసారి సెలెక్టర్లు పలు అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. కివీస్లో ఆడే రెండు టెస్ట్లకు మధ్య మూడు రోజులు మాత్రమే గ్యాప్ ఉంది. అంతేకాక గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో న్యూజిలాండ్ పిచ్లు చాలా నెమ్మదించాయి. దీంతో బౌలింగ్ కాంబినేషన్ అంశం కాస్త ఇబ్బంది పెట్టేలా ఉంది. నలుగురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లను ఎంపిక చేస్తారా? లేదా ఐదుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లను తీసుకుంటారా చూడాల్సి ఉంది. అశ్విన్, జడేజాకు అదనంగా మూడో స్పిన్నర్ కావాలనుకుంటే కుల్దీప్ యాదవ్ను ఎంపిక చేయవచ్చు. ఫారిన్ టూర్స్లో కుల్దీప్ తమ ప్రైమరీ ఆప్షన్ అని కోచ్ రవిశాస్త్రి గతంలోనే చెప్పాడు. హార్దిక్ ఫిట్గా లేడు కాబట్టి ఐదో పేసర్ వైపు మొగ్గు చూపితే అప్పుడు నవ్దీప్ సైనీకి చాన్స్ దొరకవచ్చు.
కేదార్ లెక్కేంటి
వన్డే టీమ్ సెలెక్షన్లో కేదార్ జాదవ్ మినహా సెలెక్టర్లు ప్రత్యేకంగా ఆలోచించాల్సిన విషయాలేమి లేవు. కొన్నాళ్లుగా కేదార్ జట్టుకు భారంగా మారాడు. టాపార్డర్ ఫామ్ వల్ల దొరికిన ఒకటి అరా చాన్సుల్లోనూ జాదవ్ సత్తా చాటలేకపోతున్నాడు. పెద్దగా బౌలింగ్ కూడా చేయలేకపోతున్న అతడిని పక్కనపెట్టాలని ఎప్పటి నుంచో ఒత్తిడి కూడా ఉంది. మరోపక్క కివీస్ పరిస్థితుల దృష్ట్యా టెక్నిక్ పరంగా కేదార్ కంటే మెరుగైన రహానెకు కూడా చాన్స్ ఇవ్వొచ్చు. కానీ వన్డేలను.. టీ20లకు కొనసాగింపు అని మేనేజ్మెంట్ భావిస్తే ముంబై క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ మిడిలార్డర్లో చోటు దక్కించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. పవర్ హిట్టింగ్తో అదరగొట్టే సూర్య 5, 6 స్థానాలకు పనికొచ్చే ఆటగాడు. డొమెస్టిక్ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న అతడిని నేషనల్ టీమ్లోకి తీసుకోవాలని హర్భజన్ సింగ్ వంటి ప్లేయర్లు డిమాండ్ చేస్తున్నారు.
టెస్ట్ టీమ్ ఇలా ఉండొచ్చు..
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా(కీపర్), రిషబ్ పంత్(కీపర్), అశ్విన్, జడేజా, బుమ్రా, షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్, కుల్దీప్/ నవ్దీప్ సైనీ.

