ఫేవరెట్గా ఇండియా
నేడు శ్రీలంకతో తొలి మ్యాచ్
బ్లూమ్ఫోంటెన్: గత నాలుగు ఎడిషన్లలో రెండుసార్లు టైటిల్.. ఒకసారి రన్నరప్గా నిలిచిన జూనియర్ ఇండియా.. అండర్–19 వరల్డ్కప్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నది. టోర్నీలో భాగంగా ఆదివారం జరిగే మ్యాచ్లో టీమిండియా.. శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. జూనియర్ స్థాయిలో తమ సత్తా ఏంటో.. ప్రపంచ క్రికెట్కు చూపడానికి కుర్రాళ్లకు మరో చాన్స్ వచ్చింది. ఐపీఎల్లో ప్లేస్ సాధించిన ఐదుగురు ప్లేయర్లతో పాటు బౌలింగ్లోనూ ఇండియా పటిష్టంగా కనిపిస్తోంది. టోర్నీ సన్నాహకాల్లో భాగంగా జరిగిన క్వాడ్రాంగ్యులర్ సిరీస్తో పాటు సౌతాఫ్రికాతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ గెలవడమే ఇందుకు నిదర్శనం. ఇక ప్రాక్టీస్ మ్యాచ్లోనూ అఫ్గానిస్థాన్ను చిత్తు చేసింది.
మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్.. జూనియర్ క్రికెట్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కుర్రాళ్ల రాతే మారిపోయింది. ఎంతో మంది టాలెంటెడ్ ప్లేయర్లు వెలుగులోకి వచ్చారు. అందులో ఒకడు.. లెఫ్టాండర్ యశస్వి జైస్వాల్. ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ అతడిని రూ. 2.4 కోట్లకు కొనుగోలు చేసింది. విజయ్ హజారేలో డబుల్ సెంచరీ సాధించిన జైస్వాల్ వరల్డ్కప్లో అత్యంత కీలకం కానున్నాడు. ఇక కెప్టెన్ ప్రియమ్ గార్గ్ కూడా మల్టీ క్రోర్ ఐపీఎల్ ప్లేయర్. 12 ఫస్ట్ క్లాస్, 19 లిస్ట్–ఎ మ్యాచ్ల అతని అనుభవం కూడా టీమిండియాకు కలిసొచ్చే అంశం. బౌలింగ్లో కార్తీక్ త్యాగీ పేస్తో నిప్పులు కురిపిస్తున్నాడు. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్పై భారీ అంచనాలున్నాయి. మరోవైపు లంకేయుల్లో కూడా అద్భుత నైపుణ్యం ఉన్నా.. టీమిండియా స్థాయికి సరితూగే చాన్స్ లేదు. లెఫ్టాండర్స్ నిపుణ ధనంజయ, సోనాల్ దినుషా, పేసర్ అమిషి డిసిల్వా మంచి ఫామ్లో ఉండటం సానుకూలాంశం. ఏదేమైనా గెలుపుతో టోర్నీలో బోణీ చేయాలని భావిస్తున్న టీమిండియాను అడ్డుకోవాలంటే లంక శక్తికి మించి శ్రమించాల్సిందే.
For More News..