ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతం : ప్రధాని

ప్రపంచ ఆర్థిక శక్తిగా  ఎదుగుతం : ప్రధాని
  • దేశాన్ని గ్లోబల్ గ్రోత్ ఇంజన్​గా మార్చడమే నా లక్ష్యం: మోదీ
  • త్వరలోనే టాప్ త్రీకి వెళ్తాం

అహ్మదాబాద్: మన దేశాన్ని గ్లోబల్ గ్రోత్ ఇంజిన్ గా మార్చడమే తన లక్ష్యమని ప్రధాని మోదీ చెప్పారు. మన దేశం త్వరలోనే ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు మనం ఆ దిశగా ప్రయాణిస్తున్నామని.. ప్రపంచ సంస్థలు, ఆర్థిక నిపుణులు ఇదే చెబుతున్నారని పేర్కొన్నారు. మరికొన్నేండ్లలోనే మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, దీనికి తనది గ్యారంటీ అని తెలిపారు. గుజరాత్ టూర్​కు వెళ్లిన మోదీ.. బుధవారం ‘వైబ్రెంట్ గుజరాత్ సమిట్’ 20వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. అలాగే రాష్ట్రంలో రూ.5 వేల కోట్లకు పైగా ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 20 ఏండ్ల కింద తాను వేసిన విత్తనం, ఇప్పుడు పెద్ద చెట్టుగా మారిందని సమిట్​ను ఉద్దేశించి అన్నారు. ‘‘ఇదేం ఈజీగా జరగలేదు. దీని వెనుక ఎంతో కష్టం ఉంది. దీన్ని మొదలుపెట్టినప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మాకు సహకరించలేదు. సమిట్​కు కేంద్ర మంత్రులు వచ్చేవారు కాదు. ఫారిన్ ఇన్వెస్టర్లు కూడా రాకుండా బెదిరింపులకు గురిచేసేవారు. అయినప్పటికీ మా పాలన, విధానాలు నచ్చి ఫారిన్ ఇన్వెస్టర్లు వచ్చేవారు” అని చెప్పారు.

ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న..

మొదటిసారి గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు తనకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని మోదీ చెప్పారు. ‘‘2001లో భూకంపం, కరువు, 2002లో గోద్రా విషాదం, అల్లర్లతో రాష్ట్రం అతలాకుతలమైంది. ఇక గుజరాత్ కోలుకోవడం కష్టమేనని, ఇక్కడి బిజినెస్ ఇండస్ట్రీ వెళ్లిపోతుందని చాలామంది అన్నారు. అది నేను చాలెంజ్ గా తీసుకున్నాను. రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేశాను. అందుకు వైబ్రెంట్ గుజరాత్ సమిట్ ఎంతగానో ఉపయోగపడింది” అని తెలిపారు. ఈ సక్సెస్ ఇంతటితో ఆగిపోకూడదని, రానున్న 20 ఏండ్లు ఇంకా ముఖ్యమని అన్నారు.

నాకు సొంతిల్లు లేదు..

‘‘నాకు పేదల సమస్యలు తెలుసు. వాటిని పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటాను. మా ప్రభుత్వం ఇప్పటికే లక్షలాది మంది పేదలకు ఇండ్లు కట్టించింది. అవన్నీ మహిళల పేరు మీదనే రిజిస్టర్ చేసింది. నా పేరు మీద ఇల్లు లేనప్పటికీ, లక్షలాది మంది ఆడబిడ్డలకు మా ప్రభుత్వం ఇల్లు కట్టించినందుకు ఆనందంగా ఉంది” అని ప్రధాని మోదీ చెప్పారు.