
సౌతాఫ్రికాపై 3-0తో సిరీస్ సొంతం
మూడో వన్డే టీమిండియాదే
వడోదర: ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన ఇండియా మహిళల టీమ్.. సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్ను 3–0తో క్లీన్స్వీప్ చేసింది. స్పిన్నర్లు ఏక్తా బిస్త్ (3/32), దీప్తి శర్మ (2/24), రాజేశ్వరి గైక్వాడ్ (2/22) చెలరేగడంతో.. సోమవారం జరిగిన ఆఖరిదైన మూడో వన్డేలోనూ టీమిండియా 6 పరుగుల స్వల్ప తేడాతో ప్రొటీస్పై గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇండియా 45.5 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. హర్మన్ప్రీత్ కౌర్ (38), శిఖా పాండే (35) మినహా మిగతా వారు నిరాశపర్చారు. ఓపెనర్లు ప్రియా పునియా (0), రోడ్రిగ్స్ (3), పూనమ్ రౌత్ (15), కెప్టెన్ మిథాలీ (11), దీప్తి శర్మ (7), తానియా (6) ఫెయిలయ్యారు. దీంతో 71/6 స్కోరుతో కష్టాల్లో పడ్డ ఇండియాను హర్మన్, శిఖా పాండే ఆదుకున్నారు. ఈ ఇద్దరు ఏడో వికెట్కు 49 రన్స్ జోడించారు.
చివర్లో మాన్షి జోషి (12) పోరాడటంతో ఇండియా ఆ మాత్రం స్కోరైనా చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా 48 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. కాప్ (29) టాప్ స్కోరర్. లూస్ (24), వోల్వర్ట్ (23), లీ (13) ఫర్వాలేదనిపించారు. స్పిన్నర్లు సమయోచితంగా పోరాడటంతో సఫారీ టీమ్ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. ఏక్తాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కాప్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.