మలేసియా టూర్ ను ఇండియా మహిళల హాకీ జట్టు విజయవంతంగా పూర్తి చేసింది. అద్భుత ఆటతో ఐదు మ్యాచ్ ల సిరీస్ ను 4–0తో సొంతం చేసుకుంది.నాలుగో మ్యాచ్ తోనే సిరీస్ ఫలితం తేలిపోయినప్పటికీ చివరి పోరులోనూ మన అమ్మాయిలు అదే తీవ్రతతో ఆడారు. 35వ నిమిషంలో నవ్ జోత్ కౌర్ చేసిన ఫీల్డ్ గోల్ సాయంతో శుక్రవారం జరిగిన ఐదోమ్యాచ్ లో 1–0తో విజయం సాధించారు. మ్యాచ్ ఆసాంతం పటిష్ట డిఫెన్స్ తో మలేసియాను ఇండియా ఉక్కిరిబిక్కిరి చేసింది. అదే టైమ్ లో ప్రత్యర్థి సర్కిల్ లోకి దూసుకెళ్లిన ఫార్వర్డ్ లైన్ అనేక అవకాశాలు సృష్టించుకుంది. చాలా చాన్స్ లను సద్వినియోగం చేసుకోలేకపోయినా.. విజయానికి కావాల్సిన ఏకైకగోల్ ను నవ్ జోత్ అందించింది. ఈ మ్యాచ్ లో ఎక్కవుగోల్స్ చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఇండియా కోచ్ జోయర్డ్ మరిన్ సిరీస్ లో ఓవరాల్ గా జట్టు ఆట బాగుందన్నాడు. మలేసియా లాంటి డిఫెన్సివ్ టీమ్ తో ఎలా ఆడాలో ప్లేయర్లు నేర్చుకున్నారని చెప్పాడు. ముఖ్యంగా కొంత మంది యువ ప్లేయర్లు ఈ టూర్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో జట్టుకు ఎలా అండగా నిలవాలో తెలుసుకున్నారని తెలిపాడు.

