- మొత్తం ఆదాయం రూ.1.43 లక్షల కోట్లు
న్యూఢిల్లీ:స్టేట్బ్యాంక్ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అంచనాలను అందుకుంది. ఈ ఏడాది జూన్తో ముగిసిన మొదటి క్వార్టర్లో రూ.21,121 కోట్ల నికర లాభాన్ని (స్టాండెలోన్) ప్రకటించింది. ఇది గత ఏడాది ఇదే క్వార్టర్తో పోలిస్తే ఇది10 శాతం ఎక్కువ. ఈసారి నికర లాభం అంచనాల కంటే ఎక్కువగా వచ్చింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో ఈ లాభం రూ.19,160 కోట్లు ఉంది. నికర వడ్డీ ఆదాయం కూడా 15 శాతం పెరిగి రూ.46,992 కోట్లకు చేరింది.
ఈసారి వడ్డీ ఆదాయం రూ.46,214 కోట్లు మాత్రమే వస్తుందన్న ఎనలిస్టుల అంచనాలు తప్పాయి. బ్యాంకు నిర్వహణ లాభం 10 శాతం పెరిగి రూ.33,529 కోట్లకు చేరుకుంది. మొత్తం ఆదాయం రూ.1.35 లక్షల కోట్ల నుంచి రూ.1.43 లక్షల కోట్లకు ఎగిసింది. మొత్తం వ్యాపారం విలువ రూ.110 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. డిపాజిట్ల విలువ రూ.60 లక్షలకోట్లకు పైగా ఉండగా, అడ్వాన్సులు రూ.50 లక్షల కోట్లు దాటాయి. మొత్తం బ్యాంక్ అడ్వాన్సులు 19 శాతం పెరిగాయి.
భారీగా పెరిగిన లోన్లు
రిటైల్, వ్యవసాయం, ఎస్ఎంఈ, కార్పొరేట్ లోన్ల విభాగాలు దూసుకెళ్లాయి. ఆర్ఏఎం అడ్వాన్సులు 18.20 శాతం, వ్యవసాయరంగ అడ్వాన్సులు 25 శాతం వృద్ధి చెందగా, ఎస్ఎంఈ అడ్వాన్సులు 22 శాతం వృద్ధిని సాధించాయి. వ్యక్తిగత రిటైల్ అడ్వాన్సులు 15 శాతం, కార్పొరేట్ అడ్వాన్సులు 18 శాతం చొప్పున పెరిగాయి. మొత్తం డిపాజిట్లు 10 శాతం పెరగగా, ‘కాసా’ డిపాజిట్లు 9 శాతం వృద్ధి చెందాయి. ఈసారి స్థూల ఎన్పీఏ నిష్పత్తి 1.47 శాతానికి మెరుగుపడింది.
ఇది గత ఏడాదితో పోలిస్తే 36 బేసిస్ పాయింట్లు మెరుగైంది. నికర ఎన్పీఏ నిష్పత్తి 9 ప్రాతిపదిక పాయింట్లు పెరిగి 0.38 శాతానికి చేరింది. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 74.2 శాతం ఉంది. ఈ క్వార్టర్లో సేవింగ్స్ బ్యాంకు ఖాతాలలో 64 శాతానికి పైగా యోనో ద్వారా డిజిటల్ పద్ధతిలో ప్రారంభమయ్యాయి. మొత్తం లావాదేవీలలో ప్రత్యామ్నాయ చానెళ్ల వాటా 98.8 శాతానికి పెరిగిందని ఎస్బీఐ ప్రకటించింది.
