- వెల్లడించిన డిజిటల్ భారత్ సర్వే
హైదరాబాద్, వెలుగు: చిన్న ఇండస్ట్రీలు ఆన్లైన్లో కొనుగోళ్ల విధానానికి మొగ్గుచూపుతున్నాయని ఇండియా ఎస్ఎంఈ ఫోరమ్ ఎంఎస్ఎంఈ డిజిటల్ ప్రొక్యూర్మెంట్ సర్వే రిపోర్టు తెలిపింది. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె దీనిని ఢిల్లీలో ఆవిష్కరించారు. డిజిటల్ భారత్ పేరుతో విడుదల చేసిన ఈ రిపోర్టు దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కొనుగోళ్ల గురించి వివరించింది. దీని ప్రకారం భారతదేశంలో ఎంఎస్ఎంఈ ప్రొక్యూర్మెంట్ ఆర్థిక వ్యవస్థ విలువ రూ.124.9 లక్షల కోట్లు ఉంటుందని అంచనా.
80 శాతం మంది ఎంఎస్ఎంఈలు డిజిటల్ ప్లాట్ఫారమ్లను భవిష్యత్తు వృద్ధికి కీలకంగా భావిస్తున్నాయి. తక్కువ ధరలు, నాణ్యమైన సరఫరాదారుల నెట్వర్క్ కోసం డిజిటల్ విధానాలను ఎంచుకుంటున్నట్లు వ్యాపారవేత్తలు తెలిపారు. రాబోయే కాలంలో మరింత మంది వ్యాపారులు ఏఐ ఆధారిత ప్రొక్యూర్మెంట్ సొల్యూషన్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక వ్యాపార సంస్థ తనకు కావలసిన ముడిసరుకులు, యంత్రాలు, సేవలను సాంప్రదాయ కాగితాల పద్ధతిలో కాకుండా, ఆన్లైన్లో (అమెజాన్ బిజినెస్, మోగ్లిక్స్ వంటివి) కొనడాన్ని డిజిటల్ ప్రొక్యూర్మెంట్ అంటారు.
