బోర్డర్‌లో పాక్ ఆర్మీపై బాంబులు వేసిన భారత సైన్యం : వీడియో

బోర్డర్‌లో పాక్ ఆర్మీపై బాంబులు వేసిన భారత సైన్యం : వీడియో

నిత్యం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్‌కు భారత ఆర్మీ తగిన బుద్ధి చెప్పింది. కశ్మీర్‌ బోర్డర్‌లో పహారా కాస్తున్న బలగాలు, సరిహద్దు గ్రామాల్లోని ప్రజల ఇళ్లపై పదే పదే తూటాలు, మోర్టార్ షెల్స్ వర్షం కురిపిస్తున్న పాక్ ఆర్మీని గట్టి దెబ్బ కొట్టింది. సరిహద్దు అవతల ఉన్న పాక్ ఆర్మీ పోస్ట్‌లను బాంబులతో ధ్వంసం చేసింది మన ఆర్మీ. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ ద్వారా నిర్దేశిత లక్ష్యాలపై దాడి చేసినట్లు ఆర్మీ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది.

ఉగ్ర మూకలను సరిహద్దు దాటించి.. భారత్‌లో విధ్వంసం సృష్టించాలని పాక్ నిరంతరం కుట్రలు చేస్తోంది. టెర్రరిస్టుల చొరబాట్లకు వీలుగా భారత జవాన్ల దృష్టిని మరల్చేందుకు పాక్ ఆర్మీ మోర్టార్ షెల్స్ ప్రయోగిస్తూ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవడం నిత్యకృత్యంగా మారింది. దాయాది దేశం కుట్రలను ఎప్పటికప్పుడు మన జవాన్లు తిప్పికొడుతూనే ఉన్నారు. అయితే తరచూ ఈ ఘటనల్లో సామాన్య పౌరులు, జవాన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాలని.. ప్రతికార చర్యగా ఇటీవల కశ్మీర్ సరిహద్దులోని కుప్వారా సెక్టార్‌లో అవతలి వైపు ఉన్న పాక్ ఆర్మీ పోస్టును బాంబులతో ధ్వంసం చేసింది భారత ఆర్మీ. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది.