మంచులో నిండు గర్భిణి.. కిలోమీటర్లు మోసిన ఆర్మీ

మంచులో నిండు గర్భిణి.. కిలోమీటర్లు మోసిన ఆర్మీ

కాస్త చల్లగా ఉంటే బయటకు అడుగు పెట్టలేం. ఇంట్లోనే దుప్పటి తన్ని పడుకుంటాం.చలికి వణుకుతూ.. గజగజ మంటాం. ఈ చలిని మనం తట్టుకోలేకపోతుంటే.. మరోవైపు మంచు కురుస్తున్న చలిలో... నీళ్లు కూడా గడ్డకట్టే టెంపరేచర్ లో  మన సైనికులు దేశం కోసం పోరాడుతున్నారు. అంతే కాదు.. ఎవరికైనా ఏ చిన్న ఆపద వచ్చినా కూడా మేమున్నామంటూ.. అండగా నిలుస్తున్నారు. ఓ నిండు గర్భిణిని గడ్డ కట్టే చలిలో స్ట్రెచర్ పై మోసుకు వెళ్తూ... ఆమె ప్రాణాల్ని కాపాడేందుకు ప్రయత్నించారు. అంబులెన్స్ కాదుకదా, మనిషి నడవడానికి కూడా కష్టమైన ఆ దారిలో మన జవాన్లు ప్రాణాలను పణంగా పెట్టి ఆ మహిళను కాపాడగలిగారు. ఈ ఘటన జమ్ము కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో చోటు చేసుకుంది.  

పాకిస్తాన్ నియంత్రణ రేఖ(ఎల్ఓసీ)కి సమీపంలో ఘజ్జర్ హిల్స్ అనే ప్రాంతం ఉంది. బారాముల్లా జిల్లా పరిధిలోకి వచ్చే ఆ చోట ఓ కుగ్రామంలో గర్భిణి మహిళకు పెద్ద కష్టం వచ్చిపడింది. నెలలు నిండిన ఆమెకు సమస్యలు తలెత్తడంతో కుటుంబీకులు సాయం కోసం అభ్యర్థించారు. మంచులో బయలుదేరిన చినార్ ఆర్మీ మెడికల్ బృందం.. గర్భిణిని స్ట్రెచర్ పై సురక్షితంగా తరలించింది. ఆ మహిళ జాడను కనిపెట్టి త్వరగా వైద్యం అందేలా చర్యలు తీసుకుంది. మెడికల్ టీమ్ స్వయంగా గర్భిణిని భుజాలపై మోస్తూ అంబులెన్స్ వద్దకు తీసుకొచ్చింది. ఘజ్జర్ హిల్స్ నుంచి సలాసన్ వరకు మొత్తం 6 కిలో మీటర్ల పాటు గర్భిణిని నలుగువైపులా మోస్తూ, ఆర్మీ జవాన్ల మెడికల్ టీమ్ ఆమెను సురక్షితంగా ఆస్పత్రికి చేర్చగలిగింది. విపరీతమైన హిమపాతం, ప్రతికూల వాతావరణంలో ఏమాత్రం చలించకుడా భారత జవాన్లు చూపిన చొరవకు స్థానికులు, బాధితురాలి కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆ మహిళ పూర్తిగా సురక్షితంగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉంది. అయితే ఆర్మీ సైనికుల సాహసానికి నెటిజన్లు జోహార్లు పలుకుతున్నారు. సైనికులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.