పాక్​కు చెందిన 18 మంది హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం

పాక్​కు చెందిన 18 మంది హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం

అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లో నివసిస్తున్న పాకిస్తాన్ కు చెందిన 18 మంది హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం లభించింది. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపుకు హాజరైన గుజరాత్ హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి వారికీ పౌరసత్వం అందజేశారు. 2016, 2018 గెజిట్ నోటిఫికేషన్‌ల ప్రకారం.. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ మైనారిటీ వర్గాలకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే అధికారం అహ్మదాబాద్,  గాంధీనగర్, కచ్ జిల్లాల కలెక్టర్లకు ఉందని అధికారిక ప్రకటన తెలిపింది. ఇప్పటి వరకు పాకిస్తాన్ కు చెందిన 1167 మందికి భారత పౌరసత్వం ఇచ్చినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా మంత్రి హర్ష్ సంఘవి మాట్లాడారు. 

భారత అభివృద్ధి పథంలో అందరు భాగస్వాములవుతారని ఆశిస్తున్నామని చెప్పారు. భారత పౌరసత్వం పొందినవారందరిని సమాజంలోని ప్రధాన స్రవంతిలో భాగం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు.  పాక్‌, అఫ్గాన్‌, బంగ్లా నుంచి వచ్చిన మైనారిటీ వర్గాలకు సులువుగా, వేగంగా భారత పౌరసత్వం ఇచ్చేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కృషి చేస్తున్నారని వెల్లడించారు. కాగా, పాక్, అఫ్గాన్, బంగ్లా నుంచి వచ్చిన ముస్లిమేతర మైనారిటీ వర్గాలకు పౌరసత్వం ఇవ్వడం కోసం  పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)– 2019ని కేంద్ర ప్రభుత్వం మార్చి 11న అమల్లోకి తీసుకొచ్చింది. దీని కింద హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రిస్టియన్లకు ఇండియన్ సిటిజన్ షిప్ ఇవ్వనుంది.