స్పేస్​లో రాజాచారి.. తెలంగాణ మూలాలున్న తొలి వ్యక్తి

స్పేస్​లో రాజాచారి.. తెలంగాణ మూలాలున్న తొలి వ్యక్తి
  • నాసా స్పేస్​ఎక్స్​ ‘ఎండ్యూరెన్స్​’ మిషన్​కు లీడర్​
  • 6 నెలల పాటు ఐఎస్​ఎస్​లో రీసెర్చ్

కేప్​కెనావరల్​: తెలంగాణ మూలాలున్న ఆస్ట్రోనాట్​ రాజాచారి (44) అంతరిక్షంలో అడుగు పెట్టారు. ఇంటర్నేషనల్​ స్పేస్​ స్టేషన్​(ఐఎస్​ఎస్​)లో 6 నెలల పాటు ప్రయోగాలు చేయనున్నారు. గురువారం నాసా–స్పేస్​ఎక్స్​ కలిసి ‘క్రూ 3’ మిషన్​లో భాగంగా డ్రాగన్​ క్యాప్సూల్​ ‘ఎండ్యూరెన్స్’​ను సక్సెస్​ఫుల్​గా పంపించాయి. రాజాచారి సహా నలుగురు ఆస్ట్రోనాట్లను ఐఎస్​ఎస్​కు చేర్చాయి. అందులో ముగ్గురు అమెరికన్​ ఆస్ట్రోనాట్లుకాగా.. ఒకరు యూరోపియన్​ ఆస్ట్రోనాట్​. మన టైం ప్రకారం గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఫ్లోరిడాలోని కేప్​కెనావరల్​లో ఉన్న నాసా కెనెడీ స్పేస్​ సెంటర్​ నుంచి రెండు స్టేజ్​ల ఫాల్కన్​9 రాకెట్.. ఎండ్యూరెన్స్​ను తీసుకుని నింగిలోకి ఎగిసింది. అంతకుముందు వర్షం పడటం, మబ్బులు కమ్మేయడంతో ప్రయోగంపై అనుమానాలు వచ్చాయి. వాతావరణం క్లియర్​ అయిపోవడంతో అనుకున్న టైంకల్లా మిషన్​ సాఫీగా సాగింది. దాదాపు 22 గంటల ప్రయాణం తర్వాత వారు సురక్షితంగా ఐఎస్​ఎస్​కు చేరుకున్నారు. వారికి తోడుగా రష్యా, బెలారస్​, అమెరికా ఆస్ట్రోనాట్లు ఇప్పటికే ఐఎస్​ఎస్​లో ఉన్నారు. నలుగురు ఆస్ట్రోనాట్లను ఐఎస్​ఎస్​ నుంచి భూమి మీదకు తీసుకొచ్చిన రెండు రోజుల్లోనే ప్రయోగాన్ని చేయడం విశేషం.

మనోడే లీడర్​

ఈ మిషన్​ను రాజాచారి లీడ్​ చేస్తున్నారు. మిషన్​ కమాండర్​గా వ్యవహరిస్తున్నారు. స్పేస్​లోకి ఆయన మొట్టమొదటి సారి వెళ్లారు. అమెరికా ఎయిర్​ఫోర్స్​ కంబాట్​ జెట్​ అండ్​ టెస్ట్​ పైలట్​గా పనిచేస్తున్న ఆయన తన తొలి అంతరిక్ష ప్రయాణంలోనే మిషన్​ లీడర్​గా ఉండడం విశేషం. ఆయనతో పాటు అమెరికా నేవీ సబ్​మెరీన్​ ఆఫీసర్​, న్యూక్లియర్​ ఇంజనీర్​ అయిన కేలా బేరన్​(34) మిషన్​ స్పెషలిస్ట్​గా వ్యవహరిస్తున్నారు. ఎండ్యూరెన్స్​ పైలట్​, మిషన్​ సెకండ్​ ఇన్​చార్జ్​గా ఆస్ట్రోనాట్​ టామ్​ మార్ష్​బర్న్​ (61) పనిచేస్తున్నారు. ఆయన మెడికల్​ డాక్టర్​, నాసా ఫ్లైట్​ సర్జన్​గానూ అంతకుముందు బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటికే ఆయన రెండుసార్లు ఐఎస్​ఎస్​కు వెళ్లొచ్చారు. నాలుగుసార్లు స్పేస్​వాక్​ చేశారు. జర్మనీకి చెందిన యూరోపియన్​ స్పేస్​ ఏజెన్సీ (ఈఎస్​ఏ) ఆస్ట్రోనాట్​ మాథియాస్​ మారర్​ (51) మెటీరియల్స్​​ సైన్స్​ ఇంజనీర్​గా వ్యవహరించనున్నారు. ఈ ప్రయోగంతో అంతరిక్షంలోకి అడుగు పెట్టిన వారి సంఖ్య 600ను దాటింది. రాజాచారి 599వ వ్యక్తి కాగా.. బేరన్​ 600, మారర్​601వ వ్యక్తిగా రికార్డులకెక్కారు.

నాసా మూన్​ మిషన్​ ‘ఆటమస్’లోనూ..

రాజాచారి ఇప్పుడు ఐఎస్​ఎస్​లోకే కాదు.. నాసా 2024లో చేయబోతున్న చంద్రుడి ప్రయోగం ‘ఆటమస్’లోనూ చోటు దక్కించుకున్నారు. చందమామపైకి వెళ్లే తొలి 18 మంది గ్రూపులో ఆయన్ను నాసా ఎంపిక చేసింది. దాదాపు 18 వేల అప్లికేషన్లను వడపోసి 2017లో రాజాను నాసా ఎంపిక చేసింది. దీంతో 1997లో కల్పనా చావ్లా, 2006లో సునీతా విలియమ్స్​ తర్వాత ఐఎస్​ఎస్​లోకి అడుగుపెట్టిన మూడో ఇండియన్​ అమెరికన్​గా ఆయన రికార్డు సృష్టించారు. రాజాచారితో పాటు బేరన్​ కూడా ఆటమస్​ ప్రయోగంలో భాగంగా చంద్రుడిపైకి వెళ్లనున్నారు.

ఎన్నో అవార్డులు..రివార్డులు

తన ఇన్నాళ్ల కెరీర్​లో రాజాచారి ఎన్నెన్నో ప్రతిష్టాత్మక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. డిఫెన్స్​ మెరిటోరియస్​ సర్వీస్​ మెడల్, ద మెరిటోరియస్​ సర్వీస్​ మెడల్, ద ఏరియల్​ అచీవ్​మెంట్​ మెడల్, ఎయిర్​ఫోర్స్​ కమెండేషన్​ మెడల్, ఎయిర్​ఫోర్స్​ అచీవ్​మెంట్​ మెడల్, ఇరాక్​ క్యాంపెయిన్​ మెడల్, కొరియన్​ డిఫెన్స్​ సర్వీస్​ మెడల్​, న్యూక్లియర్​ డిటరెన్స్​ ఆపరేషన్స్​ సర్వీస్​ మెడల్స్​ను పొందారు.

రాజాచారి నాన్నది మహబూబ్​నగర్​

రాజాచారి అమెరికాలోనే పుట్టినా.. తెలంగాణ మూలాలున్నాయి. వాళ్ల నాన్న శ్రీనివాస చారిది మహబూబ్​నగర్​. 1950ల్లోనే ఆయన అమెరికాకు వలస వెళ్లారు. చదువుకునే సమయంలో ఆయనకు పెగ్గీ ఎగ్బర్ట్​ను ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. 2010లో శ్రీనివాస చారి చనిపోయారు. ఏదైనా గొప్పది సాధించాలన్న తన తండ్రిచ్చిన స్ఫూర్తితోనే తాను ఆస్ట్రోనాట్​గా ఎదిగానంటారు రాజాచారి. కాగా, శ్రీనివాసచారి, పెగ్గీ ఎగ్బర్ట్​లకు 1977 జూన్​ 24న విస్కాన్సిన్​లోని మిల్వాకీలో రాజాచారి పుట్టారు. ఐవాలోని సీడార్​ ఫాల్స్​లో పెరిగారు. ఏరోనాటికల్​ అండ్​ ఆస్ట్రోనాటికల్​ ఇంజనీరింగ్​ నుంచి మాస్టర్స్​ పట్టా పొందిన ఆయన.. ఇరాక్​తో యుద్ధం లోనూ పాల్గొన్నారు. ఆ టైమ్​లో ఎల్మండార్ఫ్​ బేస్​, అలాస్కా, ఆర్​ఏఎఫ్​ లేకెన్​హీత్​లలో పనిచేశారు. ఆ తర్వాత నేవల్​ ఎయిర్​ఫోర్స్​లోనూ వివిధ హోదాల్లో చారి పనిచేశారు. నాసా ఆస్ట్రోనాట్​గా ఎంపికైన టైమ్​లో ఆయన ఎడ్వర్డ్స్​ బేస్​లో 461వ ఫ్లైట్​ టెస్ట్​ స్క్వాడ్రన్​కు కమాండింగ్​ ఆఫీసర్​గా పనిచేశారు. నాసాకు ఎంపికై రెండేండ్ల పాటు ఆస్ట్రోనాట్​ శిక్షణను పొందారు. ఇక, హోలీ షాఫ్టర్​ను రాజాచారి పెండ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురుపిల్లలున్నారు.